11,100 దిగువకు నిఫ్టీ 

31 Jul, 2019 07:59 IST|Sakshi

రెండో రోజూ కొనసాగిన నష్టాలు  

కీలక స్థాయిల దిగువకు సెన్సెక్స్, నిఫ్టీలు  

289 పాయింట్లు పతనమై 37,397కు సెన్సెక్స్‌ 

104 పాయింట్ల నష్టంతో 11,085కు నిఫ్టీ  

ఆరంభ లాభాలు కోల్పోయి మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ క్షీణించాయి.  సెన్సెక్స్‌ 37,500 పాయింట్ల, నిఫ్టీ 11,100 పాయింట్ల (200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌–11,140 పాయింట్లు) దిగువకు పతనమయ్యాయి. కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పది పైసలు పతనం కావడం, ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి.  అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చర్చలు ఆరంభం కావడం, ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక సమావేశం మంగళవారం రాత్రి నుంచి మొదలు కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బ్యాంక్, వాహన, లోహ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 289 పాయింట్లు నష్టపోయి 37,397 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో 11,085 పాయింట్ల వద్ద ముగిశాయి.  నిఫ్టీకి ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌కు రెండున్నర నెలల  కనిష్ట స్థాయి.  

చివరి గంటన్నరలో నష్టాలు: అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం చర్చలు ఆరంభం కావడం, రేట్ల కోత ఉండగలదన్న అంచనాల నడుమ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మొదలు కానుండటంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్‌ కూడా లాభాల్లోనే మొదలైంది. రోజులో ఎక్కువ భాగం లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరి గంటన్నరలో నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 264 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 327 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా   591 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  
►యస్‌ బ్యాంక్‌ 9 శాతం నష్టంతో రూ.86 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన   షేర్‌ ఇదే.  
►కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యం కావడంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌తో రూ.154 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.800 కోట్ల మేర కరిగిపోయింది.  
►దాదాపు 600కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.  అయితే భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా లాభపడింది.   
►రెండు రోజుల స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.09 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.3.09 లక్షల కోట్లు తగ్గి రూ.1,40,73,090 కోట్లకు పరిమితమైంది.  

నేటి బోర్డ్‌ సమావేశాలు
ఐషర్‌ మోటార్స్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, అశోక్‌ లేలాండ్, అలహాబాద్‌ బ్యాంక్, ఫ్యూచర్‌ రిటైల్, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, కేర్‌ రేటింగ్స్, అపోలో టైర్స్, యూపీఎల్, సింఫనీ, జీ మీడియా కార్పొరేషన్, ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్, అజంతా ఫార్మా, ఇండియాబుల్స్‌ వెంచర్స్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, హెరిటేజ్‌ ఫుడ్స్, బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్,                            

మరిన్ని వార్తలు