స్టాక్స్ వ్యూ

23 Nov, 2015 01:21 IST|Sakshi

టెక్ మహీంద్రా : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.535
టార్గెట్ ధర: రూ.615
ఎందుకంటే:  1,690 కోట్ల డాలర్ల మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ వినూత్నమైన. వినియోగదారుడు కేంద్రంగా ఐటీ  సర్వీసులను, సొల్యూషన్లను, కన్సల్టింగ్, ఎంటర్‌ప్రైజ్, టెలికాం సొల్యూషన్లను అందిస్తోంది. 390 కోట్ల డాలర్ల టెక్ మహీంద్రా కంపెనీ లక్షకు పైగా ఉద్యోగులతో 90 దేశాల్లో 788కి పైగా  కంపెనీలకు తన సర్వీసులను ఆఫర్ చేస్తోంది.  

వీటిల్లో కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.రూ.720 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.786 కోట్లకు ఎగసింది. ఆదాయం రూ.5,488 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.6,615  కోట్లకు, ఇబిటా రూ.1,155 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,266 కోట్లకు పెరిగాయి.

షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.8.16గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.3,492 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ2లో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 788కు పెరిగింది.  నార్డిస్ సర్వీసెస్, ఒక అంతర్జాతీయ కార్ల కంపెనీ నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్(ఏసీజీఎస్) డెవలప్ చేయడానికి గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీనే ఎంపిక చేసింది.  

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌డ్ సర్వీసెస్ భాగస్వామిగా టెక్ మహీంద్రాను ఏషియన్ టెలికాం కంపెనీ ఎంచుకుంది. డేటా సర్వీసుల టెస్టింగ్,డిజైన్, యాక్టివేట్ వంటి కార్యకలాపాలకు ఒక ఉత్తర అమెరికా టెలికాం కంపెనీ కూడా టెక్ మహీంద్రానే ఎంచుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 45 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  ఇటీలనే ఆర్‌బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్‌ను పొందింది.
 
సీఈఎస్‌ఈ : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర:  రూ.542
టార్గెట్ ధర: రూ.668
ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. విద్యుత్తు టారిఫ్‌లు 8 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.1,757 కోట్లకు పెరిగింది.

విద్యుత్తు కొనుగోలు వ్యయం 58 శాతం, ఉద్యోగుల వ్యయం 7 శాతం చొప్పున పెరగడంతో ఇబిటా మార్జిన్లు స్వల్పంగా తగ్గి 24 శాతానికి పడిపోయాయి. ఇంధన వ్యయం 20 శాతం, ఇతర వ్యయాలు 14 శాతం చొప్పున తగ్గాయి. 2,325 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి కోల్‌కత, హౌరాలకు డిస్ట్రిబ్యూషన్ లెసైన్స్ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 15.5 శాతం సాధిస్తోంది.

ఏడాదికి రూ.500 కోట్ల నగదు నిలకడగా ఆర్జిస్తోంది. గత ఆరేళ్లుగా తన రిటైల్ విభాగం స్పెన్సర్స్‌లో రూ.1,400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఇలా పెట్టుబడులు పెట్టడం సీఈఎస్‌సీ నగదు స్థితిగతులపై ప్రభావం చూపినప్పటికీ, స్పెన్సర్ వ్యాపారం మెరుగుపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లోనే స్పెన్సర్స్ ఇబిటా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి.

రెండేళ్లలో స్పెన్సర్స్ ఆదాయం 23 శాతం, స్టోర్ ఏరియా 14 శాతం, స్టోర్ సేల్స్ 8 శాతం  చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2012-13లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీలో 57% వాటాను రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ కంపెనీ రుణభారం తగ్గడానికి, మార్జిన్లు పెరగడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది.

ఈ ఏడాదిమార్చి నాటికి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ స్థూల రుణం 11 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 5 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్న కంపెనీగా మారనున్నది. 600 మెగావాట్ల చంద్రపూర్ ప్రాజెక్ట్‌కు ఇటీవలనే అనుమతులు సాధించింది. హల్దియా ప్లాంట్ ఇటీవలనే కార్యకలాపాలు ప్రారంభించింది. అన్ని వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి సీఈఎస్‌సీ టార్గెట్ ధరను నిర్ణయించాం.
 
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

మరిన్ని వార్తలు