సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసి దాదాపు 500 పాయింట్ల మేర లాభపడ్డాయి. తద్వారా నిఫ్టీ 11వేల స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 433 పాయింట్లు ఎగిసి 37391 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 11052 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా అమెరికా ప్రభుత్వం చైనా దిగుమతులపై టారిఫ్ల విధింపులో వెనకడుగు వేయడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు ఊరట లభించింది. డిసెంబరు వరకు 10 శాతం టారిఫ్లు విధింపు వాయిదా వేసింది. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ప్రధానంగా మెటల్, మీడియా, రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్ పుంజుకోగా..ఫార్మా టాప్ లూజర్గా ఉంది. జీ, టాటా స్టీల్, ఐబీ హౌసింగ్, గెయిల్, వేదాంతా, హిందాల్కో, యూపీఎల్, అల్ట్రాటెక్, బీపీసీఎల్, హెచ్యూఎల్ లాభపడుతుండగా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 5.5 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, పవర్గ్రిడ్, సిప్లా, టీసీఎస్, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం నష్టపోతున్నాయి. అయితే ఫలితాల ప్రభావంతో అపోలో హాస్పిటల్స్ లాభపడుతోంది.