సాక్షి, ముంబై: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్మార్కెట్లు లాభాల్లోకి ప్రవేశించాయి. సెన్సెక్స్ 117పాయింట్లు పుంజుకుని 36,700వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు బలపడి 10,951 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్ టైంని హైని తాకింది. ఇది మార్కెట్లకు ఊతమిస్తోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ లాభాలతో నిఫ్టీ 11వేల స్థాయిని అధిగమించేందుకు ఉరకలు వేస్తోంది.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షతన రెండు రోజుల మానిటరీ కమిటీ పాలసీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కొనసాగనుందని విశ్లేషకుల అంచనా. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యలు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.
మెటల్, ఎఫ్ఎంసీజీ,రియల్టీ బలహీనంగా ఉండగా, మీడియా, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్ లాభపడుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, టైటన్, ఇండస్ఇండ్, డాక్టర్ రెడ్డీస్, జీ, బజాజ్ ఆటో, హీరో మోటో, ఎంఅండ్ఎం, యూపీఎల్, ఐషర్, యాక్సిస్ టాప్ విన్నర్స్గా ఉండగా, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఐటీసీ, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, సిప్లా, ఐవోసీ, ఎయిర్టెల్, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. ప్రధానంగా రియల్టీ సెక్టార్కు సంబంధించి ఇండియాబుల్స్ డీఎల్ఎఫ్, ఫీనిక్స్, యూనిటెక్, బ్రిగేడ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ నష్టపోతున్నాయి.