సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమైనాయి. వరుసగా 10 రోజులుగా నష్టాల బాటపట్టిన కీలక సూచీలు కీలక మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ఫ్లాట్గాప్రారంభమైన కీలక సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 75 పాయింట్లు క్షీణించి 37015 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల బలహీనంగా 11117 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 37వేల స్థాయికి దిగువకు చేరే దశలో ఉంది. అయితే లాభనష్టాల తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.
వాణిజ్య వివాద పరిష్కార చర్చలు విఫలంకావడంతో 200 బిలియన్ డాలర్ల చైనీస్ దిగుమతులపై టారిఫ్లను 25 శాతానికి పెంచేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయించింది. దీనికి ప్రతిగా చైనా సైతం 60 బిలియన్ డాలర్ల అమెరికన్ దిగుమతులపై సుంకాల విధింపునకు నిర్ణయించింది. దీంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు 2-4 శాతం మధ్య పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది.
ఇది దేశీయ స్టాక్మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఫార్మ తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ఎస్బ్యాంకు,పీఎన్బీ, సౌత్ ఇండియా, బీవోబీ, ఎస్బీఐ ఇలా అన్ని బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో రూపాయి కొద్దిగా కోలుకుంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే 70.44 వద్దట్రేడింగ్ను ఆరంభించింది. డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 70.52 వద్ద నిన్న స్థిరపడింది.