స్టాక్స్ వ్యూ

7 Dec, 2015 03:08 IST|Sakshi

భారతీ ఇన్‌ఫ్రాటెల్ : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.396
టార్గెట్ ధర: రూ.450
ఎందుకంటే: వెర్లైస్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన టెలికాం టవర్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర టెలికాం మౌలిక సదుపాయాలను అందజేస్తోంది. ఈ తరహా సేవలను  అందిస్తున్న అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి.  

వివిధ మొబైల్ ఆపరేటర్లకు(ఆదాయం పరంగా టాప్ త్రీ పొజిషన్లలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌లకు) కమ్యూనికేషన్ స్ట్రక్చర్స్‌ను, టెలికాం టవర్లమౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా అందిస్తోంది. కంపెనీ 87వేలకు పైగా టెలికాం టవర్లను నిర్వహిస్తోంది. వీటిల్లో ఈ కంపెనీ సొంతానివి 37వేలకు పైగా ఉండగా, మిగతావి ఈ కంపెనీకి 42 శాతం వాటా ఉన్న ఇంటస్ టవర్స్ కంపెనీవి.

తన కార్యకలాపాల్లో అధిక భాగం పర్యావరణ అనుకూల విధానాలనే పాటిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ2లో రూ. 2,930 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 4 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.1,328 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,516 కోట్లకు ఎగసింది.

నికర లాభం రూ.465 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.579  కోట్లకు పెరిగింది.  గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,773 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.6,053 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇదే జోరును రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగించవచ్చు.

ప్రస్తుత ధరకు, పుస్తక ధరకు మధ్య ఉన్న నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.83కు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.43కు తగ్గుతుందని అంచనా.  రెండేళ్లలో నికర అమ్మకాలు 7 శాతం, నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.450 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
బ్రిటానియా ఇండస్ట్రీస్ : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్
ప్రస్తుత ధర: రూ.2,936
టార్గెట్ ధర: రూ.3,650
ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4 శాతం పెరిగి 15 శాతానికి చేరింది. ఇదే జోరు ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆర్నెళ్లలో  కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ఈ ఆర్నెళ్లలో అమ్మకాలు 8-10 శాతం వృద్ధి చెందుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.

ముడి పదార్ధాల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండడం, వివిధ వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు 14 శాతం రేంజ్‌లో ఉండొచ్చని  భావిస్తోంది. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందితే ఈ కంపెనీకి భారీగా ప్రయోజనం కలుగనున్నది. గత ఒక నెల కాలంలో ఈ షేర్ ధర 11 శాతం వరకూ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలో ఈ షేర్ కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. మంచి వృద్ధి అవకాశాలున్న ఈ షేర్‌ను రూ.3,650 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం.

టైగర్ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి తేనున్నది. రస్క్, కేకుల వంటి స్నాక్‌ల మార్కెట్లోకి మరింతగా విస్తరించనున్నది. 75 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ కంపెనీకి వస్తోన్న అంతర్జాతీయ ఆదాయం మొత్తం ఆదాయంలో 6 శాతంగానే ఉంది. కొత్త ఉత్పత్తులతో, నెట్‌వర్క్ ఇస్తరణతో దీనిని నాలుగేళ్లలో 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిస్కెట్ల కంటే మార్జిన్లు అధికంగా ఉండే కేక్‌లు, రస్క్‌ల అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది.

వినూత్నమైన, విభిన్నమైన రుచులు గల ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి రూ.65 కోట్లతో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,858 కోట్లుగా ఉన్న కంపెనీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,836 కోట్లకు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,312 కోట్లకు పెరుగుతాయని అంచనా.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

మరిన్ని వార్తలు