పట్టుకోండి..ఎక్కడికీ పారిపోనీకండి!

30 Jul, 2018 16:05 IST|Sakshi

ఆటింగ్వా ప్రభుత్వ స్పందనకు  కేంద్రం రియాక్షన్‌

చోక్సీని నిర్బంధించండి

ఏ మార్గంలోనూ పారిపోనీకుండా అడ్డుకోండి

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు కోట్లాది రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మోహుల్‌ ఛోక్సీని అష్టదిగ‍్బంధనం చేసేందుకు  రంగం సిద్ధమవుతోంది. తాను పారిపోలేదని ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నానంటూ ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా  భారత ప్రభుత్వం  కదులుతోంది.   చోక్సీని నిర్బంధించాల్సిందిగా‌ ఆంటిగ్వా, బర్బుడా ప్రభుత్వాలను  కేంద్రం కోరింది.  ఈ మేరకు   ప్రభుత్వ వర్గాలు  ఒక ప్రకటనలో వెల్లడించాయి.  త్వరలోనే భారత  రాయబారి ఆటింగ్వాలోని బర్బుడా ప్రభుత్వ ధికారులను కలవనున్నారు.

ఆంటిగ్వాలో మెహుల్ చోక్సీ  వ్యవహారంపై  అక్కడి ప్రభుత్వం స్పందించిన వెంటనే  జార్జిటౌన్‌లోని  భారత హై కమిషన్  అధికారులు ఆంటిగ్వా , బార్బుడా ప్రభుత్వాలకు లేఖలు రాశారు. చోక్సీ కదలికల గురించి నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అతన్నివెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. భూ, వాయు లేదా సముద్ర మార్గాల్లో పారిపోకుండా  అడ్డుకోవాలని కోరినట్టు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌  స్కాం రూ.13వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో కీలక నిందితులు, డైమండ్‌ వ్యాపారులు నీరవ్‌ మోదీ, చోక్సీని భారత్‌ రప్పించే  ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే భారత ప్రభుత్వం వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది.  అలాగే పలు ఆస్తులను ఎటాచ్‌  చేసిన దర్యాప్తు బృందాలు ఈడీ, సీబీఐ దర్యాప్తును ముమ్మరంగా  సాగిస్తున్నాయి.

కాగా  ద్రోహులకు తమ దేశంలో స్థానం లేదనీ, భారత ప్రభుత్వం కోరితే చోక్సీ అరెస్ట్‌కు తగిన చర్యలు తీసుకుంటామని, భారత ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఆంటిగ్వా విదేశాంగ మంత్రి స్పందించడంతో భారత ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. అయితే  తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు గతేడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు పీఎన్‌బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్‌ చోక్సీ  గతవారం ప్రకటించాడు.  తద్వారా  130 దేశాలకు ఎటువంటి వీసా లేకపోయినా ప్రయాణించే అనుమతి ఉందని  ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు