ఫండ్‌ స్కీమ్స్‌ను అటూ–ఇటూ మార్చకూడదు

7 Jul, 2018 01:36 IST|Sakshi

స్పష్టత ఇచ్చిన సెబీ

న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌(ఏఐఎఫ్‌) నిర్వహిస్తున్న ఓపెన్‌–ఎండెడ్‌ స్కీమ్స్‌ను క్లోజ్‌డ్‌–ఎండెడ్‌ స్కీమ్స్‌గా మార్చడానికి లేదని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తెలిపింది. అలాగే క్లోజ్‌డ్‌–ఎండెడ్‌ స్కీమ్స్‌ను ఓపెన్‌–ఎండెడ్‌ స్కీమ్స్‌గా కూడా మార్చకూడదని పేర్కొంది. ఏఐఎఫ్‌ నిబంధనలకు సంబంధించి సింగులర్‌ ఇండియా ఆపర్చునిటీస్‌ ట్రస్ట్‌(ఎస్‌ఐఓటీ) లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడంలో భాగంగా సెబీ ఈ స్పష్టతని ఇచ్చింది.

ఓపెన్‌ ఎండెడ్‌ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఎప్పుడైనా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. వీటికి నిర్దేశిత మెచ్యూరిటీ కాలపరిమితి ఉండదు. క్లోజ్‌డ్‌–ఎండెడ్‌ స్కీమ్స్‌కు నిర్దేశిత కాలపరిమితి ఉంటుంది. ఏఐఎఫ్‌లు రకరకాలైన స్కీమ్‌లను ఆఫర్‌ చేయవచ్చు. అయితే ఏదైనా స్కీమ్‌ను ఆరంభించే ముందు ఆ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను కనీసం 30 రోజుల ముందు సెబీకి నివేదించాల్సి ఉంటుంది.  

భారత్‌లో నమోదైన ఏఐఎఫ్‌లు దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సమీకరించి ముందుగా నిర్ణయించిన విధానాల ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఏఐఎఫ్‌లో వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్, హెడ్జ్‌ ఫండ్స్, ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్, కమోడిటీ ఫండ్స్, డెట్‌ ఫండ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌ కలగలసి ఉంటాయి.   

మరిన్ని వార్తలు