వచ్చే ఏడాది వృద్ధి పరుగులు!

26 Mar, 2016 00:48 IST|Sakshi
వచ్చే ఏడాది వృద్ధి పరుగులు!

దేశీయ వినిమయమే దన్ను...మోర్గాన్ స్టాన్లీ అంచనా
ముంబై: వినిమయం దన్నుగా భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) పటిష్ట వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను ప్రముఖ వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది.   సంస్థ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు...

ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వాస్తవ వడ్డీరేటు సానుకూలంగా మారడం వంటి అంశాల నేపథ్యంలో వినియోగం బలపడనుంది. 1998 నుంచి 2002 వరకూ సాగిన రికవరీ సైకిల్‌కన్నా మంచి వృద్ధి తీరు ఉంటుంది.

ముఖ్యంగా ప్రైవేటు వినియోగం భారీగా పెరగడానికి  7వ వేతన కమిషన్ అమలు ప్రధాన కారణం. కొత్త ఉపాధి సృష్టి అవకాశాలూ మెరుగుపడ్డం మరొక కారణం.

వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర, రాష్ట్రాల ద్రవ్యలోటు 5.8% ఉంటుంది. (కేంద్రానికి సంబంధించి 3.5%, రాష్ట్రాలకు సంబంధించి 2.3%). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ఈ పరిమాణం 5.9 శాతం. గడచిన మూడేళ్లుగా ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు తగ్గుతూ రావడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతోంది.

కార్పొరేట్ల అధిక రుణభారం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు.. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసురుతున్న అంశాల్లో కీలకమైనవి.

>
మరిన్ని వార్తలు