ఈ–కామర్స్‌లోకి సూర్య బ్రాండ్‌

14 Feb, 2017 01:43 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సూర్య బ్రాండ్‌తో ఆహారోత్పత్తుల తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఈ–కామర్స్‌లోకి ప్రవేశిస్తోంది. తొలుత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందుకోసం సొంత పోర్టల్‌ను ఆవిష్కరిస్తోంది. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల నుంచి త్వరితగతిన సరుకుల డెలివరీకి వీలవుతుందని హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎండీ రవీంద్ర మోదీ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని చెప్పారు. డిజిటైజేషన్‌ కారణంగా రానున్న రోజుల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు మరింత పెరుగుతాయని ఆయన వివరించారు.

 ప్రసుత్తం కంపెనీ మసాలాలు, పచ్చళ్లు, స్వీట్లు, నమ్‌కీన్‌ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది. పలు దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది. రానున్న రోజుల్లో పాపులర్‌ ప్రొడక్టులనే విక్రయించాలని సంస్థ భావిస్తోంది. సూర్య బ్రాండ్‌తో ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్‌ను 2018లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని రవీంద్ర మోదీ వెల్లడించారు. సూర్య బ్రాండ్‌లో ప్రీమియం ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తామన్నారు. అలాగే విదేశాల నుంచి ఎంపిక చేసిన ఆహారోత్పత్తులను తీసుకొచ్చి ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కేంద్రం కోసం ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు