ఏడాదిలో ఐపీఓకి! 

24 Apr, 2019 01:00 IST|Sakshi

సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌  బ్యాంక్‌ ఎండీ భాస్కర్‌ బాబు

తెలుగు రాష్ట్రాల్లో తొలి  బ్రాంచ్‌ ఆరంభం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఆర్‌.భాస్కర్‌ బాబు చెప్పారు. ఐపీఓ ద్వారా 450– 500 కోట్ల రూపాయలను సమీకరించాలని లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి రూ.248 కోట్లు సమీకరించామని, ప్రస్తుతం బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, ఐడీఎఫ్‌సీ, ఐఎఫ్‌సీ, గజా క్యాప్, లోక్‌ క్యాప్‌ తదితర సంస్థలకు వాటాలున్నాయని తెలియజేశారు. మూలధన అవసరాలను బట్టి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరిస్తామని, ఇప్పుటికైతే ఆర్థిక వనరులకు కొరత లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి శాఖను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో బ్రాంచ్‌ను ఆరంభిస్తామని, క్రమంగా రెండు తెలుగురాష్ట్రాల్లో 25కు పైగా శాఖల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమకు అన్ని బ్యాంకు శాఖల్లో 4వేల మంది ఉద్యోగులున్నారని, త్వరలో మరిన్ని రిక్రూట్‌మెంట్స్‌ చేపడతామని తెలిపారు.  

పెద్ద బ్యాంకులతో పోటీ లేదు 
ఆర్‌బీఐ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు అనుమతులివ్వడంలో ప్రధానోద్ధేశం చిన్న రుణాలను విస్తృతీకరించడమేనని భాస్కర్‌ చెప్పారు. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌గా అవతరించి రెండేళ్లయిందని, బడా బ్యాంకులతో తమకు పోలిక, పోటీ లేవని చెప్పారు. ‘‘సమర్ధవంతమైన వ్యయనియంత్రణ కారణంగా పెద్ద బ్యాంకులతో పోలిస్తే డిపాజిట్లపై దాదాపు 1 శాతం వరకు మేం ఎక్కువ వడ్డీ ఇవ్వగలుగుతున్నాం. మేమిచ్చే రుణాల్లో అన్‌సెక్యూర్డ్‌ రుణాలు ఎక్కువ శాతం ఉన్నా, అవన్నీ చిన్న మొత్తాలు కావడ వల్ల వసూలు పరంగా ఇబ్బందులు రావడం లేదు. లోన్‌బుక్‌లో చిరు వ్యాపారులకు 1– 5 లక్షల రూపాయల వరకు రుణాలు, వాహన రుణాలు, ఎస్‌ఎంఈ రుణాలు, చిన్నగృహరుణాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద రుణాలు మా పోర్టు ఫోలియోలో ఉండవు కాబట్టి ఎన్‌పీఏల సమస్య చాలా తక్కువ’’ అని వివరించారు. క్యు3లో స్థూల ఎన్‌పీఏలు 2.94 శాతం, నికర ఎన్‌పీఏలు 0.94 శాతంగా ఉన్నాయని చెప్పారాయన.   

మరిన్ని వార్తలు