సుజుకీ జీఎస్‌ఎక్స్‌–ఎస్‌750@ రూ.7.45 లక్షలు

26 Apr, 2018 00:53 IST|Sakshi

గరిష్ట వేగం 320 కి.మీ. మైలేజీ 20 కి.మీ.!

సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తొలి 750 సీసీ సూపర్‌ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జీఎస్‌ఎక్స్‌–ఎస్‌750 పేరుతో అందిస్తున్న ఈ బైక్‌ ధర రూ.7.45 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌ కోసం ప్రతి ఏడాది కొత్త బైక్‌లను, ప్రీమియమ్‌ బైక్‌లను అందించే కట్టుబడిలో భాగంగా ఈ సూపర్‌ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని సుజుకీ మోటార్‌సైకిల్‌  ఇండియా ఎండీ, సతోషి యుచిడా పేర్కొన్నారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో తామందిస్తున్న తొలి కొత్త బైక్‌ ఇదని, అంతేకాకుండా 1,000 సీసీ కంటే తక్కువగా ఉండే కేటగిరీలో కూడా ఇదే తొలి మోటార్‌సైకిల్‌ అని వివరించారు.

ఈ బైక్‌ను 749 సీసీ ఫోర్‌ సిలిండర్‌ ఫ్యూయల్‌–ఇంజెక్షన్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రూపొందించామని తెలిపారు. యాంటీ–లాక్‌ బ్రేక్స్‌తో కూడిన డిస్క్‌ బ్రేక్‌లు, ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్‌ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఈ బైక్‌ గరిష్ట వేగం గంటకు 320 కి.మీ. కాగా,  మైలేజీ లీటర్‌కు 20 కి.మీ. ఇస్తుందని అంచనా. ఈ బైక్‌  కవాసకి జెడ్‌900, ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్, అప్రిలియా షివర్‌ 900 తదితర సూపర్‌ బైక్‌లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 

మరిన్ని వార్తలు