చిన్న కమతాలే పెద్ద సమస్య

12 Mar, 2018 00:30 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో అధికం

స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఓఓ వీరెన్‌ పొప్లి

(చండీగఢ్, సాక్షి బిజినెస్‌ బ్యూరో) : భారత్‌లో వ్యవసాయ యాంత్రికీకరణకు ప్రధాన అవరోధం చి న్న కమతాలేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇవి చాలా ఎక్కువని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఓఓ వీరెన్‌ పొప్లి అభిప్రాయపడ్డారు. ఇంతవరకు 60 హెచ్‌పీలోపు ట్రాక్టర్ల ఉత్పత్తిపైనే శ్రద్ధ చూపిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ తొలిసారి అధిక హెచ్‌పీ విభాగంలోకి కాలుమోపింది. ఇందులో భాగంగా 60– 75 హెచ్‌పీ విభాగంలో కొత్తగా స్వరాజ్‌ 963 ఎఫ్‌ఈ పేరిట కొత్త ట్రాక్టర్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా చండీగఢ్‌లో సాక్షి బిజినెస్‌ బ్యూరోతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న కాంట్రాక్ట్‌ ఫామింగ్‌ బిల్లుతో చిన్న కమతాల సమస్య క్రమంగా కనుమరుగుకావచ్చని ఆయన అంచనా వేశారు. కాంట్రాక్ట్‌ ఫామింగ్‌ సరైన రీతిలో అమల్లోకి వస్తే శక్తిమంతమైన యంత్రాల వినియోగం పెరుగుతుందన్న ఆలోచనతో కంపెనీ ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ నెల్లో ఎంసీఎఫ్‌సీఎ(కాంట్రాక్టు సాగు ముసాయిదా బిల్లు)కు కేబినెట్‌ ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.  

స్టీల్‌ ధరలు పెరగడమే ప్రమాదం!
క్రూడాయిల్‌ ధర పెరుగుదల కన్నా స్టీల్‌ ధరల పెరుగుదలపైనే ఆటో రంగం ఆందోళన చెందుతోందని వీరెన్‌ చెప్పారు. స్టీలు ధరల పెంపుతో ఉత్పాదకాల ధరలు పెరిగి అంతిమంగా విక్రయాలు, లాభాలపై నెగిటివ్‌ ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ముందుగా ఏపీ, తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రైతులకు కొత్త ట్రాక్టర్‌ అందుబాటులోకి వస్తుందని, త్వరలో దేశమంతా విక్రయాలు ఆరంభిస్తామని ఎం అండ్‌ ఎం వ్యవసాయోపకరణాల విభాగం అధిపతి రాజేశ్‌ జెజుకరి చెప్పారు. దీని ఆరంభ ధర రూ. 7.4 లక్షలు(మొహాలీ ఎక్స్‌ షోరూం ధర).ఇతర ప్రత్యేకతలు: 60హెచ్‌పీ ఇంజన్, 2200 కిలోల లిఫ్టింగ్‌ సామర్ధ్యం.3 రేంజ్‌ స్పీడ్‌ ఆప్షన్, డిజిటల్‌ డాష్‌ బోర్డ్‌ తదితరాలు. 

మరిన్ని వార్తలు