కిరాణా సేవల్లోకి ‘స్విగ్గీ’

13 Feb, 2019 04:15 IST|Sakshi

స్టోర్స్‌ పేరిట ఎఫ్‌ఎంసీజీ ప్లాట్‌ఫాం

బెంగళూరు: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ నిర్వహణ సంస్థ ‘స్విగ్గీ’ వేగం పెంచింది. పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కోవడం కోసం వ్యాపార సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు కేవలం ఫుడ్‌ డెలివరీ సేవల్లోనే ఉన్న ఈ సంస్థ.. గ్రోఫర్స్, బిగ్‌ బాస్కెట్‌ తరహాలో ఇక నుంచి కిరాణా వస్తువులు, మందులు, శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఇతర రోజువారీ సదుపాయాలను అందించనుంది. ఇందుకోసం ‘స్టోర్స్‌’ పేరిట ఒక ప్రత్యేక ఎఫ్‌ఎంసీజీ ఫ్లాట్‌ఫాంను మంగళవారం ఆవిష్కరించింది.

తొలుత ఈ సేవలను హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రారంభించింది. ఇక్కడి 3,500 స్టోర్స్‌ను యాప్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టోర్‌కు మా సేవలను అనుసంధానం చేయడంలో భాగంగా ప్రత్యేక ఎఫ్‌ఎంసీజీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్విగ్గీ యాప్‌లోనే ఈ ప్రత్యేక సేవ ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, పూలు, పెట్‌ కేర్‌ వంటి 200 ప్రత్యేక స్టోర్లను ఇప్పటికే యాప్‌తో అనుసంధానం చేశాం అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు