స్విస్‌ షాక్ ‌: రూ.283 కోట్లు ఫ్రీజ్‌

27 Jun, 2019 13:30 IST|Sakshi

పీఎన్‌బీ స్కాంలో, నీరవ్‌ మోదీకి భారీ షాక్‌

నీరవ్‌, ఆయన సోదరి పుర్వీకి చెందిన బ్యాంకు ఖాతాలు  ఫ్రీజ్‌

నాలుగు   అకౌంట్లలో మొత్తం రూ.283 కోట్ల  నగదు  స్థంభన

సాక్షి,  న్యూఢిల్లీ : పీఎన్‌బీ కుంభకోణం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  వేల కోట్లకు పంజాబ్‌ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి  స్విస్‌ అధికారులు భారీ షాకిచ్చారు. కోట్ల రూపాయల విలువైన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. పీఎన్‌బీ స్కాంను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విజ‍్ఞప్తి మేరకు వారు ఈ చర్య చేపట్టారు.

మనీలాండరింగ్ నివారణ (పిఎంఎల్‌ఎ) చట్టం కింద ఈడీ  అభ్యర్థన మేరకు స్విట్జర్లాండ్‌లోని నాలుగు బ్యాంకు ఖాతాలను అక‍్కడి అధికారులు సంభింపచేశారు.  నీరవ్‌మోదీ, ఆయన సోదరి పుర్వీ మోదీకు చెందిన ఖాతాలతో సహా మొత్తం  నాలుగు  అకౌంట్లలోని రూ. 283.16 కోట్ల రూపాయలను స్విస్ అధికారులు  ఫ్రీజ్‌ చేశారు.  భారతీయ బ్యాంకుల నుండి అక్రమంగా స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో  మళ్లించారని స్విస్‌ అధికారులకు ఈడీ తెలిపింది. 

కాగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఒయు) ద్వారా పీఎన్‌బీలో రూ. 14వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చీ రాగానే  నీరవ్‌మోదీ, బంధువులతో సహా లండన్‌కు పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తును  కొనసాగిస్తున్నాయి. అటు  భారత ప్రభుత్వం  నీరవ్‌ పాస్‌పోర్టును రద్దు చేసింది.  రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసిన సీబీఐ లండన్‌ పోలీసుల సహాయంతో, ఈ ఏడాది మార్చి నెలలో మోదీని అరెస్టు చేసింది. వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్లను పలుసార్లు  లండన్‌ కోర్టు  తిరస్కరించింది.  ఆర్థికనేరగాళ్ల చట్టం కింద మోదీని స్వదేశానికి  రప్పించేందుకు  భారత ప్రభుత్వం  తీవ్రంగా ప్రయ్నత్నిస్తోంది.  

మరోవైపు ఇదే కేసులో మరో కీలక నిందితుడు, నీరవ్‌ మోదీ మామ మెహుల్‌ చోక్సీ  కూడా ఆంటిగ్వాకు  పారిపోయాడు.  అయితే చోక్సీని అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ఇటీవల  ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు