న్యూయార్క్: అమెరికా, భారత్ల మధ్య నడుస్తున్న సుంకాలపరమైన పోరు.. అమెరికన్ యాపిల్ ఎగుమతిదారులకు ప్రతికూలంగా మారింది. భారత ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా సుంకాలు విధించిన దరిమిలా.. భారత్ కూడా దీటుగా అమెరికా యాపిళ్లు, బాదంపప్పు మొదలైన వాటిపై టారిఫ్లు పెంచడమే ఇందుకు కారణం. తాజా పెంపుతో వాషింగ్టన్ యాపిల్స్పై సుంకాలు 70 శాతానికి చేరాయి. 2017లో భారత్ 40 పౌన్ల బరువుండే 78 లక్షల వాషింగ్టన్ యాపిల్ బాక్సులు దిగుమతి చేసుకున్నట్లు యకిమ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. అయితే, 2018 పంటకు సంబంధించి భారత్ దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించింది. ప్రస్తుతం టారిఫ్ల వడ్డనతో ఇది మరింతగా తగ్గిపోవచ్చని అభిప్రాయపడింది. అమెరికా యాపిళ్లను అత్యధికంగా దిగుమతి చేసుకునే టాప్ దేశాల్లో మెక్సికో, కెనడా, భారత్ ఉన్నాయి.