టాటా కొత్త ఎస్‌యూవీ ‘హారియర్‌’

12 Jul, 2018 00:51 IST|Sakshi

2019 క్యూ1లో మార్కెట్‌లోకి...

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తన కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ‘హారియర్‌’ను ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది ప్రకటించింది. 2019 తొలి త్రైమాసికంలో దీన్ని ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్‌ ఈ హారియర్‌ ఎస్‌యూవీని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌తో కలిసి అభివృద్ధి చేస్తోంది. కాగా కంపెనీ ఆటో ఎక్స్‌పో 2018లో హెచ్‌5ఎక్స్‌ కాన్సెప్ట్‌తో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. స్టైల్, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్‌ వంటి పలు అంశాల్లో తమ భవిష్యత్‌ ప్రొడక్ట్‌ నమూనాలను ప్రతిబింబించేలా హారియర్‌ ఉంటుందని టాటా మోటార్స్‌ తెలిపింది. ఇంపాక్ట్‌ డిజైన్‌ 2.0 ఆధారంగా రూపొందుతున్న తొలి వెహికల్‌ ఇదని పేర్కొంది. అత్యుత్తమ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లను హారియర్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.

తొలి కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్, కొత్త సెడాన్‌ టిగోర్, కాంపాక్ట్‌ కారు టియాగో వంటి మోడళ్లతో టాటా మోటార్స్‌ తిరిగి విజయపథంలోకి వచ్చింది. ల్యాండ్‌ రోవర్‌ డీ8 ఆర్కిటెక్చర్‌పై భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా మోటార్స్‌ ఇంజనీర్లు ఈ హారియర్‌ను తయారు చేశారని కంపెనీ పేర్కొంది. ‘టర్న్‌అరౌండ్‌ 2.0 ప్రణాళిక ఫలితాలను ఇస్తోంది. వేగంగా ఎదుగుతాం. అందులో భాగంగానే హారియర్‌ను తీసుకువస్తున్నాం. దీన్ని 2019 తొలి త్రైమాసికంలో ఆవిష్కరిస్తాం. ఈ కొత్త ఎస్‌యూవీ ద్వారా సంస్థ బ్రాండ్‌ విలువ మరో స్థాయికి చేరుతుంది’ అని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌ విభాగం) మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు