మార్కెట్లోకి టాటా మోటార్స్‌ ‘ఇంట్రా’

23 May, 2019 00:03 IST|Sakshi

దేశంలోనే తొలి కమర్షియల్‌ కాంపాక్ట్‌ ట్రక్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌... దేశీ మార్కెట్లోకి బుధవారం రెండు కొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసింది.  టాటా ఇంట్రా వీ10, వీ20 పేరుతో రెండు కమర్షియల్‌ కాంపాక్ట్‌ ట్రక్‌లను సంస్థ ఎండీ, సీఈఓ గుంటర్‌ బషెక్, సంస్థ కమర్షియల్‌ వెహికల్స్‌ బిజినెస్‌ హెడ్‌ గిరీష్‌ వాఘ్‌ సమక్షంలో విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా చిన్న శ్రేణి వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరిగింది. మా సంస్థకు సంబంధించి 1:2 దామాషా మేర పెద్ద, చిన్న వాహనాల అమ్మకాలు సాగుతున్నాయి.

మేం గతంలో ప్రవేశపెట్టిన టాటా ఏస్‌ కమర్షియల్‌ వాహన శ్రేణిలో దేశంలోనే టాప్‌లో ఉంది’’ అని గిరీష్‌ వాఘ్‌ వ్యాఖ్యానించారు. కమర్షియల్‌ వాహనాల కేటగిరీ అమ్మకాల్లో తమ సంస్థ 2018–19లో 60 శాతం వృద్ధి సాధించిందన్నారు. వీ10, వీ20లు దేశంలోనే తొలి కాంపాక్ట్‌ ట్రక్‌లని బశ్చెక్, వాఘ్‌ చెప్పారు. డ్రైవింగ్‌ సీటు కేబిన్‌లో ఏసీ, తక్కువ స్థలంలోనే ఎక్కువ వృత్తం తిరగగల పవర్‌ స్టీరింగ్, రోజుకు ఏకధాటిగా 8–12 గంటల ప్రయాణం చేయగల సామర్థ్యం వీటి ప్రత్యేకతలని చెప్పారు. టాటా ఇంట్రా వీ 10 ధర రూ.5.35 లక్షలు కాగా,  వీ 20 ధర రూ.5.85 లక్షలు. 

మరిన్ని వార్తలు