కార్ల కంపెనీల ధరల హారన్‌

14 Dec, 2018 03:45 IST|Sakshi

జనవరి 1 నుంచి 4% వరకు పెంపు ప్రకటనలు

దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్‌ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్‌ మోటార్స్‌ ఇండియా తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్‌లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ  నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్‌ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్‌  హర్‌దీప్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్‌ ఇండియా ఈడీ వినయ్‌ రైనా వెల్లడించారు.  ఇక టాటా మోటార్స్‌..మోడల్‌ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్‌ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 

మరిన్ని వార్తలు