టాటా సన్స్‌ ప్రతిపాదనపై మిస్త్రీ ఫైర్‌

16 Sep, 2017 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై:  టాటా గ్రూపులోని టాటా సన్స్‌ సంస్థ పబ్లిక్ లిమిటెడ్  కంపెనీ నుంచి ప్రైవేట్ లిమిటెడ్‌గా అవతరించనుంది.  టాటా సన్స్‌ సంస్థను  ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చే ప్రతిపాదనను  మైనారిటీ షేర్‌హోల్డర్ల అనుమతి కోరేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్‌లలో మార్పులు చేయాల్సి ఉండగా.. దీనికి వాటాదారుల అనుమతి కంపెనీ కోరనుంది.
 
అయితే  మిస్త్రీ కుటుంబానికి చెందిన పెట్టుబడి సంస్థ  సైరస్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రెవేట్  లిమిటెడ్ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ హక్కుల అణచివేసేందుకు తీసుకున్న చర్య అంటూ  బోర్డు కు ఒక లేఖ రాసింది.  ఈ ప్రతిపాదన మైనారిటీ వాటాదారులను  మరింత అణిచివేసే  "మరొక ఆయుధం" గా  పేర్కొంది.

మరోవైపు టాటా సన్స్ ఒక ప్రైవేటు కంపెనీగా మారితే, మైనారిటీ వాటాదారుల హక్కులను  మరింత నిరుత్సాహపరుస్తుందని  ప్రాక్సీ సలహా  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీరామ్ సుబ్రమణ్యన్  వ్యాఖ్యానించారు.  ఇది ఒక తిరోగమన దశ అని పేర్కొన్నారు.

ఒకవేళ టాటాసన్స్ ప్రతిపాదనను షేర్‌హోల్డర్లు ఆమోదిస్తే, టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్  ప్రైవేట్ లిమిటెడ్‌గా కంపెనీ పేరు మారుతుంది. సెప్టెంబర్ 21న వార్షిక సర్వ సభ్య సమావేశం జరగనుండగా.. దీనికి ముందుగా ఈ ప్రతిపాదన రావడం విశేషం.  అయితే.. దీనికి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఆమోదం రావాల్సి ఉంటుంది. దీంతో పాటు 75 శాతం మైనారిటీ వాటాదారులు కూడా అనుమతించాలి.   సైరస్‌ మిస్త్రీ ని  టాటా సన్స్ బోర్డు  ఛైర్మన్‌గా తొలగించిన తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత  సంస్థ  ఈ నిర్ణయం తీసుకుంది.  

 

మరిన్ని వార్తలు