భారీ పన్ను సంస్కరణలకు కేంద్రం రెడీ..!
అంచనాలను మించుతున్న క్యూ2 ఫలితాలు
అమెరికా–చైనా ఒప్పందం దాదాపు ఖరారు
మరో పావు శాతం తగ్గనున్న ‘ఫెడ్’రేటు
అన్నీ సానుకూలంశాలే... రోజంతా లాభాలే !!
కీలక నిరోధ స్థాయిలకు సెన్సెక్స్, నిఫ్టీలు
582 పాయింట్ల లాభంతో 39,832కు సెన్సెక్స్
160 పాయింట్లు ఎగసి 11,787కు నిఫ్టీ
దీపావళి పండుగ వెళ్లిపోయినా, స్టాక్ మార్కెట్లో లాభాల కాంతులు తగ్గలేదు. మరిన్ని ఉద్దీపన చర్యలతో పాటు ఆదాయపు పన్నులో కూడా కోత విధించాలని కేంద్రం భావిస్తోందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ మంగళవారం దుమ్ము రేపింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కానుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో కుమ్మేశారు. సోమవారం బలిపాడ్యమి సెలవు సందర్భంగా ఒక రోజు విరామం తర్వాత ఆరంభమైన ప్రధాన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ మంగళవారం కీలకమైన నిరోధ స్థాయిలపైన ముగియడం విశేషం. బీఎస్ఈ సెన్సెక్స్ 39,800 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,750 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నాలుగు నెలల గరిష్టానికి ఎగిశాయి. సెన్సెక్స్ 582 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు ఎగసి 11,787 పాయింట్ల వద్ద ముగిశాయి. టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల బీఎస్ఈ సూచీలు, ఎఫ్ఎమ్సీజీ మినహా మిగిలిన అన్ని నిఫ్టీ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
ఆల్టైమ్ హైకి రిలయన్స్..
డిజిటల్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేనున్నామని, వచ్చే ఏడాది కల్లా రిలయన్స్ జియోను రుణ భారం లేని కంపెనీగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటూ రిలయన్స్ తెలిపింది. దీంతో మంగళవారం కంపెనీ షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,480 ను తాకింది. చివరకు 2.3% లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది.
మరిన్ని విశేషాలు...
లాభాలు ఎందుకంటే...
రూ. 2.73 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
లాభాల జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.73 లక్షల కోట్లు ఎగసింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.73 లక్షల కోట్లు ఎగసి రూ.1,52,04,693 కోట్లకు చేరింది.