న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊరటనిచ్చే దిశగా స్టార్టప్స్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు పన్నులపరంగా పూర్తి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంజెల్ ఫైనాన్షియర్స్ సహా ఇతరత్రా ఇన్వెస్టర్లు చేసే రూ. 10 కోట్ల దాకా పెట్టుబడులకు ఇది వర్తిస్తుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కనీసం రూ. 2 కోట్ల నికర విలువ లేదా, గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున రూ. 25 లక్షలకు పైగా ఆదాయం కలిగిన ఏంజెల్ ఇన్వెస్టర్లు.. స్టార్టప్స్లో చేసే పెట్టుబడులపై 100 శాతం పన్ను మినహాయింపులు పొందడానికి వీలవుతుంది.
ప్రస్తుతం ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఐటీ చట్టం సెక్షన్ 56 కింద పన్నులు విధిస్తుండటంపై పలు స్టార్టప్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 18 స్టార్టప్స్కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు కూడా పంపింది. ఇప్పటిదాకా ఏంజెల్ ఇన్వెస్టర్లకు సంబంధించి ప్రత్యేకించి నిబంధనలేమీ లేవని, ఈ నోటిఫికేషన్తో స్పష్టతనిచ్చినట్లవుతుందని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం రమేష్ అభిషేక్ పేర్కొన్నారు.