వారికి టెక్‌మహింద్రా 2వేలకు పైగా ఉద్యోగాలు

15 Jul, 2017 18:09 IST|Sakshi
2వేల మందిని పైగా నియమించుకుంటాం..
న్యూయార్క్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు టెక్‌ దిగ్గజాలన్నీ అమెరికన్లకు భారీగా ఉద్యోగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో దేశీయ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టెక్‌ మహింద్రా కూడా ఈ ఏడాది అమెరికాలో 2,200 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. గతేడాది కూడా ఈ కంపెనీ ఇంతేమొత్తంలో ఉద్యోగులను నియమించుకుంది. తమ దేశంలో ఉద్యోగాలను సృష్టించాలని ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో టెక్‌ మహింద్రా ఈ నియామకాల ప్లాన్‌ను ప్రకటించినట్టు తెలిసింది. ముంబైకి చెందిన ఈ కంపెనీకి అమెరికాలో 6000 మంది ఉద్యోగులుండగా.. 400 మందికి పైగా క్లయింట్స్‌ ఉన్నారు. గత నాలుగేళ్లుగా కూడా ఈ కంపెనీ నియామకాలు కాలేజీల నుంచే జరుగుతున్నాయి. ''గతేడాది తాము సుమారు 2,200 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. ఈ ఏడాది కూడా అంతేమొత్తంలో నియమించుకోవాలని చూస్తున్నాం'' అని టెక్‌ మహింద్రా అధ్యక్షుడు, స్ట్రాటజిక్‌ వెర్టికల్స్‌ లక్ష్మణన్‌ చిదంబరం చెప్పారు.
 
అమెరికాలో నియామకాలకు ప్రధాన కారణంగా.. ఆ దేశ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు అందాయని, అమెరికాలో ఉద్యోగాలు కల్పించడంలో తాము అతిపెద్ద పాత్ర పోషించాలని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్‌ మహింద్రాకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికాలో మొత్తం 28 నగరాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అంతేకాక 16 డెవలప్‌మెంట్‌ సెంటర్లను కలిగిఉంది. ప్రపంచవ్యాప్తగా ఈ కంపెనీకి 1.17 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఐటీ కంపెనీలు ఇటీవల అమెరికా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో తీవ్ర కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొంటున్నాయి. వ్యాపార వాతావరణంలోను, వర్క్‌ పర్మిట్‌లోనూ ఆ దేశాలు పరిమితులు విధిస్తున్నాయి.. కాగ, కంపెనీలు కూడా భారత్‌లో ఉద్యోగాల కోత విధించి, అమెరికాలో భారీగా నియామకాల ప్రక్రియకు తెరలేపినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ రిపోర్టులను టెక్‌ దిగ్గజాలు ఖండిస్తున్నాయి.  
 
మరిన్ని వార్తలు