టెక్‌ మహీంద్రా లాభం రూ.836 కోట్లు

2 Nov, 2017 00:05 IST|Sakshi

ఫలించిన డేవిడ్‌ వ్యూహం

సవాళ్లున్నా మంచి వృద్ధి సాధించాం

కంపెనీ వైస్‌ చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌  

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.645 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.836 కోట్లకు పెరిగిందని టెక్‌ మహీంద్రా తెలిపింది. ఆదాయం రూ.7,167 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.7,606 కోట్లకు పెరిగిందని టెక్‌ మహీంద్రా వైస్‌ చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ చెప్పారు. డాలర్ల పరంగా నికర లాభం 34 శాతం వృద్ధితో 12.9 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 117 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, పరిశ్రమ డిమాండ్‌లు అప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పటికీ, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ మంచి వృద్ధి సాధించామని  వినీత్‌ నయ్యర్‌ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.5,961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు 75,587, బీపీఓ వ్యాపారానికి సంబంధించిన ఉద్యోగులు 35,287గా మొత్తం  మీద తమ కంపెనీ ఉద్యోగులు 1.17 లక్షలుగా ఉన్నారని వివరించారు.

డేవిడ్‌ వ్యూహంతో వృద్ధి...
తమ డేవిడ్‌ (డిజిటైజేషన్, ఆటోమేషన్, వెర్టికలైజేషన్, ఇన్నోవేషన్, డిస్‌రప్షన్‌) వ్యూహం మంచి ఫలితాలనిస్తోందని, ఆదాయం, లాభం, కొత్త వ్యాపారాల్లో మంచి వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ ఎండీ, సీపీ, గుర్నాని పేర్కొన్నారు. ఫలి తాల నేపథ్యంలో మార్కెట్లో టెక్‌ మహీంద్రా షేరు 1.5 శాతం పెరిగి రూ.489 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు