ఫేస్‌బుక్ హవా తగ్గుతోంది !

28 Nov, 2014 00:43 IST|Sakshi
ఫేస్‌బుక్ హవా తగ్గుతోంది !

న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ముఖ్యంగా ఫేస్‌బుక్ హవా తగ్గుతోంది. మిత్రులతో కమ్యూనికేషన్ల కోసం ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల కంటే కూడా వుయ్ చాట్, వాట్సాప్‌లను వినియోగించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో ఈ పోకడ అధికంగా ఉందని గ్లోబల్‌వెబ్ ఇండెక్స్(జీడబ్ల్యూఐ) రీసెర్చ్ తెలిపింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 42 వేల మంది(5,000 మంది భారతీయులు)పై నిర్వహించిన సర్వే ముఖ్యాంశాలు...,
 సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల యాక్సెస్ ప్రపంచవ్యాప్తంగా 187 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 242 శాతం పెరిగింది.
 
ఇంటర్నెట్‌ను ఉపయోగించే వాళ్లలో 83 శాతం మందికి ఫేస్‌బుక్ అకౌంట్లున్నాయి. వీరిలో 47 శాతం మంది మాత్రమే వీటిని చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే, ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న వాళ్లలో 93 శాతానికి ఫేస్‌బుక్ ఖాతాలున్నాయి. వీటిని చురుకుగా ఉపయోగిస్తున్నవారు 48 శాతం మాత్రమే.
 
ఫేస్‌బుక్ ద్వారా మిత్రులకు మెసేజ్‌లు పంపే వారి సంఖ్య తగ్గుతోంది. గత ఏడాది క్యూ1లో 51.2 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య అదే ఏడాది క్యూ4లో 40 కోట్లకు, ఈ ఏడాది క్యూ3లో 31.3 కోట్లకు తగ్గింది.
     
వుయ్‌చాట్, వాట్సాప్‌ల వంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది క్యూ1లో 44.6 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య అదే ఏడాది క్యూ4లో 53.8 కోట్లకు, ఈ ఏడాది క్యూ3లో 61.6 కోట్లకు పెరుగుతోంది.

మరిన్ని వార్తలు