అవాంఛిత కాల్స్‌పై అవగాహన పెంచండి

16 Aug, 2019 11:20 IST|Sakshi

ట్రాయ్‌ని కోరిన టెల్కోలు  

న్యూఢిల్లీ: అవాంఛిత టెలిమార్కెటింగ్‌ కాల్స్‌కు సంబంధించి అమల్లోకి వస్తున్న నిబంధనల గురించి వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని టెలికం సంస్థలు కోరాయి. ఫిర్యాదులు, పరిష్కార విధానం పనిచేసే తీరు గురించి కస్టమర్లకు తెలిస్తే నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌(సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ తెలిపారు. ‘డు నాట్‌ డిస్టర్బ్‌’ విధానం పనితీరు, ఐచ్ఛికాలను, ఫిర్యాదులను నమోదు చేసే ప్రక్రియ, నియోగదారులకు వారి హక్కుల గురించిన అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఇందుకోసం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫండ్‌ నుంచి నిధులు ఉపయోగించవచ్చని మాథ్యూస్‌ చెప్పారు. అవాంఛిత కాల్స్‌పై కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉంచినవి, పూర్తి వివరాలు లేనందువల్ల తిరస్కరించినవి, విచారణ తర్వాత సహేతుకమైనవిగా పరిగణనలోకి తీసుకున్నవి తదితర అంశాలతో టెలికం సంస్థలు ప్రతి నెలా నివేదిక సమర్పించాలంటూ ట్రాయ్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వస్తోంది. 

మరిన్ని వార్తలు