జియో ఎఫెక్ట్‌: నష్టాల్లో టెలికాం రంగ షేర్లు

16 Jul, 2020 11:29 IST|Sakshi

17శాతం నష్టపోయిన వోడాఫోన్‌ 

2శాతం క్షీణించిన ఎయిర్‌టెల్‌ 

5శాతం పతనమైన భారతి ఇన్ఫ్రాటెల్‌

వచ్చే ఏడాది కల్లా భారత్‌లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌ ప్రకటనతో గురువారం ఉదయం సెషన్‌లో టెలికాం షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ రంగానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2నుంచి 17శాతం నష్టాన్ని చవిచూశాయి. 

కొన్ని నెలల క్రితం వోడాఫోన్‌లో టెక్‌ దిగ్గజం గూగుల్‌ పెట్టుబడులు పెడుతుందని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్‌ జియోలో 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్‌ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. అలాగే స్పెక్ట్రం వేలం వేసిన తర్వాత రిలయన్స్ మేడ్ ఇన్ ఇండియా 5 జి సొల్యూషన్స్‌ను ట్రయల్ కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లపై ఒత్తిడిని పెంచాయి.  

బీఎస్‌ఈలో టెలికాం రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ టెలికాం ఇండెక్స్‌ 2శాతం మేర నష్టాన్ని చవిచూసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ ఇండెక్స్‌ 30శాతం లాభపడటం పడింది. ఇదే సమయంలో సెనెక్స్‌ సూచీ 8శాతం నష్టాన్ని చవిచూడటం గమనార్హం. వోడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌  షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. రిలయన్స్‌ షేరు మాత్రం 1శాతం లాభంతో కదులుతోంది.  

మరిన్ని వార్తలు