తెలుగు కస్టమర్లకు టెలినార్‌ సరికొత్త ఆఫర్స్‌

30 Oct, 2017 08:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నార్వేకు చెందిన టెలికాం ఆపరేటర్‌ టెలినార్‌ తెలుగు రాష్ట్రాల కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్యాకేజీలు ప్రీపెయిడ్‌ వాయిస్‌, డేటా సర్వీసులకు ఎంతో సరసమైనవని తెలిపింది. టెలినార్‌ ప్రవేశపెట్టిన ప్లాన్లలో ఒకటి ఎస్‌టీవీ 143. ఈ ప్లాన్‌ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లోని పాత కస్టమర్లు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా 2జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా సర్వీసులను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను పొందాలంటే ఎఫ్‌ఆర్‌సీ 148తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 

అదేవిధంగా ఎక్కువ వాడక కస్టమర్ల కోసం ఎఫ్‌ఆర్‌సీ 448ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త ఫస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద 84 రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, హైస్పీడు 4జీ డేటాను వాడుకోవచ్చని టెలినార్‌ పేర్కొంది. తమ కొత్త ప్లాన్లలతో కొత్త, పాత కస్టమర్లు బిల్లు గురించి ఆందోళన చెందకుండా తమ ప్రియమైన వారితో అపరిమితంగా మాట్లాడుకోవచ్చని టెలినార్‌ ఇండియా టీఎస్‌, ఏపీ సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీనాథ్‌ కోటియాన్‌ తెలిపారు. సరసమైన ఉత్పత్తులు, సంబంధిత సర్వీసులతో కస్టమర్లకు వీలైనన్ని సేవలు టెలినార్‌ అందిస్తూ ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు