అరవింద్‌ లాభం రూ.67 కోట్లు 

18 May, 2019 00:03 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.2 డివిడెండ్‌ 

ఎన్‌సీడీల ద్వారా  రూ.300 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అరవింద్‌ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.115 కోట్ల నికర లాభం వచ్చిందని అరవింద్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,863 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అరవింద్‌ కంపెనీ నుంచి బ్రాండెడ్‌ దుస్తుల వ్యాపార విభాగాన్ని అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిమిటెడ్‌ పేరుతో గత ఏడాది నవంబర్‌లో విడదీశామని (డీమెర్జ్‌), అందుకని అప్పటి, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 7–8 శాతం వృద్ధిచెందగలదన్న అంచనాలున్నాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్, గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా జయేశ్‌ కె. షాను నియమించామని, ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల జారీ ద్వారా రూ.300 కోట్లు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అర్వింద్‌ షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.74 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు