వైజాగ్‌లో టీఎల్‌టీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

22 Aug, 2015 02:20 IST|Sakshi
వైజాగ్‌లో టీఎల్‌టీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

ఉక్కునగరం(విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్, పవర్‌గ్రిడ్‌లు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్స్(టీఎల్‌టీ) ప్రాజెక్ట్‌కు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఆర్‌ఐఎన్‌ఎల్, పవర్‌గ్రిడ్ టిఎల్‌టి ప్రైవేట్ లిమిటెడ్ 50:50 భాగస్వామ్యంలో టీఎల్‌టీల ఉత్పత్తిపై గతంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 1.20 లక్షల టన్నుల టీఎల్‌టీలను ఉత్పత్తి చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ బీసీ గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ పనులకు స్టీల్‌ప్లాంట్ సిఎండి పి.మధుసూదన్, పవర్ గ్రిడ్ సిఎండి ఆర్.ఎన్.నాయక్‌లు శంకుస్దాపన చేశారు.

ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల్లో ఇటువంటి సంయుక్త భాగస్వామ్య సంస్థలు ఏర్పాటు ఆవశ్యకమన్నారు.  పవర్‌గ్రిడ్ సిఎండీ నాయక్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఏడాదిలోగా పూర్తయ్యి ఉత్పత్తి ప్రారంభించడం ఇరుసంస్దలకు లాభదాయకమన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు డైరక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావులు, పవర్‌గ్రిడ్ డైరక్టర్లు ఐ.ఎస్.ఝా, ఆర్.పి. శశ్మాల్, మెకాన్ డైరక్టర్ దీపక్ దత్తా తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు