2018లో రేటు పెరుగుదల లేనట్లే!

14 Mar, 2018 02:06 IST|Sakshi

విశ్లేషకుల అభిప్రాయం

ముంబై: ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.  
బడ్జెట్‌లో ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర పెంపు – ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– నొమురా అభిప్రాయపడింది.  
 పారిశ్రామిక వృద్ధి రేటు మెరుగుపడిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో ఆర్‌బీఐ రేటు తగ్గింపునకు అవకాశం లేదని దేశీయ క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది.  వినియోగ డిమాండ్, గృహ అద్దె అలవెన్సులు, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాల వల్ల రిటైల్‌ ద్రవ్యోల్బణం 2018–19లో సగటున 4.6 శాతం నమోదయ్యే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా  వేస్తోంది.  
 సింగపూర్‌ బ్యాంక్‌ డీబీఎస్‌ కూడా రేటు తగ్గింపునకు అవకాశం లేదని తన తాజా విశ్లేషణలో వివరించింది.  

రేటు పావుశాతం పెరగవచ్చు: కేర్‌ రేటింగ్స్‌
కాగా రెపోను 2018లో పావుశాతం పెంచే అవకాశం ఉందని కేర్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అధిక శ్రేణికి పెరిగే అవకాశం ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటు పెరుగుతోందని, చమురు ధరల తీవ్రత, వ్యవసాయ వృద్ధి తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. అయితే ఈ శ్రేణికి మించి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కేర్‌ తన నివేదికలో వెల్లడించింది.

బీఓఏఎంఎల్‌ భిన్నం...
కాగా, ఆగస్టులో  పాలసీ రేటును పావుశాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ (బీఓఏఎంఎల్‌) అంచనావేస్తోంది. ‘ద్రవ్యోల్బణం పెరిగినా... ఆర్‌బీఐ ఫ్రేమ్‌వర్క్‌ రేంజ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. ఇదే రేటు తగ్గింపు నిర్ణయానికి దోహదపడే కారణ మవుతుందని భావిస్తున్నాం’’అని తన నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు