మూడో రోజూ లాభాలు

28 Aug, 2019 09:06 IST|Sakshi

ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి నిధుల ఎఫెక్ట్‌...

దీంతో మరిన్ని ఉద్దీపన చర్యలుండొచ్చని అంచనాలు  

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు 

54 పైసలు పుంజుకున్న రూపాయి  

147 పాయింట్లు పెరిగి 37,641కు సెన్సెక్స్‌

48 పాయింట్ల లాభంతో 11,105కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ లాభాల జోరు కొనసాగుతోంది. ఉద్దీపన ప్యాకేజీతో పాటు ఆర్‌బీఐ నుంచి రూ.1.76 లక్షల కోట్లు కేంద్రానికి అందనుండటం, ఈ నిధుల దన్నుతో మరిన్ని ఉద్దీపన చర్యలు ఉండొచ్చన్న అంచనాల కారణంగా వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. వాణిజ్య యుద్ధం నివారణ నిమిత్తం చైనా–అమెరికాల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కానుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభాపడటం కూడా కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 54 పైసలు బలపడి 71.48కు తగ్గడం సానుకూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు ఒక శాతం మేర పెరిగినప్పటికీ, మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో 282 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 147 పాయింట్ల లాభంతో 37,641 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,105 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు మూడు వారాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1,168 పాయింట్లు, నిఫ్టీ 364 పాయింట్లు చొప్పున పెరిగాయి. లోహ, వాహన, చమురు, గ్యాస్‌ షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో  ఐటీ షేర్లు నష్టపోయాయి. 

సెన్సెక్స్‌... 282 పాయింట్ల రేంజ్‌
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఒక దశలో 238 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 44 పాయింట్లు తగ్గింది. మొత్తం మీద రోజంతా 282 పాయింట్ల రేంజ్‌లో పెరిగింది. 

3 రోజుల్లో రూ.4.8 లక్షల కోట్లు
స్టాక్‌ మార్కెట్‌ మూడు రోజుల్లో మంచి లాభాలు సాధించడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.8 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4.8 లక్షల కోట్లు ఎగసి రూ.1,41,46,021  కోట్లకు చేరింది.  

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ పూర్తి
ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌  100% పూర్తయింది. ఈ రూ.8,260 కోట్ల షేర్ల బై బ్యాక్‌లో భాగంగా మొత్తం 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను సగటున రూ.747.38 ధరకు కొనుగోలు చేశామని ఇన్ఫోసిస్‌ తెలి పింది. ఈ ఏడాది మార్చి 20న మొదలైన ఈ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 26న ముగిసిందని పేర్కొంది.

మరిన్ని వార్తలు