లాక్‌డౌన్‌ : మూడు గంటల్లో రూ.10 కోట్లు

12 May, 2020 10:36 IST|Sakshi

హాట్‌ కేకుల్లా అమ్ముడుబోయిన రైలు టికెట్లు

30వేల టికెట్ల ద్వారా రూ. 10కోట్ల ఆదాయం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతినిచ్చిన నేపథ్యంలో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుబోయాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక రైళ్ల కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేయడం ప్రారంభించిన తరువాత సోమవారం (మే 11) మొదటి మూడు గంటల్లో 54 వేల మంది ప్రయాణికులు 30 వేల టికెట్లు కొనుగోలు  చేశారు. తద్వారా సుమారు రూ .10 కోట్లు ఆదాయం  రైల్వే శాఖకు సమకూరింది.  (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!)

ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) రైళ్ల టికెట్ల అమ్మకాల ద్వారా సోమవారం రాత్రి 9 గంటలకు రూ .9.9 కోట్ల  ఆదాయం వచ్చిందని రైల్వే అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ముంబై- న్యూఢిల్లీ మార్గంలో టికెట్లు మే 12-17 వరకు పూర్తిగా అమ్ముడుబోయాయని తెలిపారు. హౌరా-న్యూ ఢిల్లీ రైలుకు సంబంధించిన అన్ని టికెట్లను మొదటి 10 నిమిషాల్లోనే బుక్ చేశారన్నారు. అయితే టికెట్ల కోసం భారీ రద్దీ కారణంగా ఐఆర్‌సీటీపీ సైట్ క్రాష్ అయింది. దీంతో బుకింగ్స్ షెడ్యూల్  రెండు గంటలు ఆలస్యమైంది.  మరోవైపు స్టాక్‌ మార్కెట్లో ఐఆర్‌సీటీసీ షేరు  ట్రేడర్ల కొనుగోళ్లతో లాభాల్లో దూసుకుపోతోంది.  (400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్)

కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని సేవలను ప్రభుత్వం పరిమితం చేసిన దాదాపు 50 రోజుల తరువాత భారత రైల్వే ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను మంగళవారం నుండి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.  కాగా మార్చి 25వ తేదీ నుంచి మే 17వరకు  దేశంలో  మూడు దశల్లో లాక్‌డౌన్ అమలవుతోంది.  ఇప్పటివరకూ దాదాపు అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు