మరిన్ని నగరాలకు ట్రూజెట్

10 Sep, 2015 01:07 IST|Sakshi
మరిన్ని నగరాలకు ట్రూజెట్

- నేటి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు
- త్వరలో విశాఖ, విజయవాడలకు
 - ట్రూజెట్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న చౌక విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్- బెంగళూరు, బెంగళూరు-షిరిడీ (ఔరంగాబాద్)లకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో కలిపి మొత్తం ఆరు పట్టణాలకు తాము విమాన సర్వీసులను అందిస్తున్నామని, త్వరలోనే దక్షిణాదిలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించనున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు.

ఈ నెలాఖరుకు మూడో విమానం అందుబాటులోకి వస్తుందని, దీంతో విజయవాడ, విశాఖపట్నంలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి విజయవాడకు సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మధ్యనే ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మా సర్వీసులకు డిమాండ్ బాగుందని, లోడ్ ఫ్యాక్టర్ 85 నుంచి 90 శాతంగా ఉందన్నారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే నిర్వహణా లాభాలను ఆర్జిస్తున్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు