గృహప్రవేశం చేద్దాం!

25 Jun, 2016 00:10 IST|Sakshi
గృహప్రవేశం చేద్దాం!

*నేడే ఇండియా ప్రాపర్టీ.కామ్ ప్రాపర్టీ షో
*65కు పైగా నిర్మాణ సంస్థలు.. 300లకు పైగా ప్రాజెక్ట్‌ల ప్రదర్శన

 సాక్షి, హైదరాబాద్: అభివృద్ధికి పక్కా ప్రణాళికలు.. చక్కటి పరిపాలన.. శాంతిభద్రతలకు పెద్దపీట.. పూర్తిస్థాయి పారదర్శకత.. భాగ్యనగరికి పెరుగుతున్న ఆదరణ.. టీఎస్-ఐపాస్, ఐటీ పాలసీలతో నగరానికి క్యూ కడుతున్న ఐటీ, ఇతర కంపెనీలు, నిర్మాణ రంగ వృద్ధికి సరికొత్త నిర్ణయాలు.. మొత్తానికి తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇదే సమయంలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో మళ్లీ హైదరాబాద్ స్థిరాస్తి రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 * కొంతకాలం నుంచి నగరంలో స్థిరాస్తి ధరలు పెద్దగా పెరగలేదు. దీంతో ఇళ్ల రేట్లు అందుబాటులోనే ఉన్నాయని చెప్పాలి. చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ రేట్లు తక్కువగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఓఆర్‌ఆర్, జోరుగా సాగుతున్న మెట్రో రైలు పనులు, వేల సంఖ్యలో స్టార్టప్ సంస్థలు, ఐటీ కంపెనీల విస్తరణ వంటి వాటితో మరో ఆరు నెలల్లో స్థిరాస్తి ధరలు పెరగనున్నాయి.

 * మరి నగరం నలువైపులా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వివరాల్ని ఒకేచోట తెలుసుకోవటం కష్టమైన పనే. దీనికి పరిష్కారం చూపించేందుకు ఇండియా ప్రాపర్టీ.కామ్ సిద్ధమైంది. గృహప్రవేశం పేరుతో శని, ఆదివారాల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 82వ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు, పలువురు బిల్డర్లతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది.

 * ఇందులో నగరానికి చెందిన 65కు పైగా నిర్మాణ సంస్థలు 300లకు పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నారు. ఇందులో లేఔట్ల నుంచి ఫ్లాట్లు, లగ్జరీ హోమ్స్, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలూ ఉన్నాయి. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, రాంకీ, మై హోమ్, ఎస్‌ఎంఆర్, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, సైబర్‌సిటీ, హిల్‌కౌంటీ, రహేజా, ప్రిస్టిజ్, ఆకృతి, దక్షిణ్, త్రిశూల్, ఏఆర్కే, వెర్టిక్స్ హోమ్స్, ముప్పా, గౌతమి, లన్సమ్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శించనున్నాయి.

* గృహ రుణాలకు సంబంధించిన వివరాలను అందించేందుకు, అక్కడికక్కడే అనుమతులూ ఇచ్చేందుకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కూడా తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక బహుమతులనూ ఇవ్వనున్నారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) నుంచి కొంత మంది బిల్డర్లు ఈ షోలో పాల్గొని హైదరాబాద్ స్థిరాస్తి రంగం అభివృద్ధిపై బృంద చర్చలు చేస్తారు.

*‘‘గృహప్రవేశం అనేది బిల్డర్లను, కొనుగోలుదారులను సాంకేతికత ద్వారా కలిపే సరైన వేదిక. కస్టమర్లు తమ బడ్జెట్‌లో ఎలాంటి ప్రాపర్టీలను ఎంచుకోవాలి? ఏ ప్రాజెక్ట్‌లో ఇంటితో పాటూ లగ్జరీ వసతులనూ పొందొచ్చు? భవిష్యత్తులో రేట్లు పెరిగే ప్రాంతాలేవి? వంటి అనేక అంశాలపై క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అలాగే ట్రూవ్యూ, డిస్కవరీ వంటి టెక్నాలజీ ద్వారా నేరుగా ప్రాపర్టీల వద్దకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారా వీక్షించే అవకాశముందని’’ ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్ చెప్పారు.

* అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల మాట్లాడుతూ.. ఇండియా ప్రాపర్టీ.కామ్ ఎక్కడ ప్రాపర్టీ షో నిర్వహించిన అందులో టైటిల్/ప్లాటినం స్పాన్సర్‌గా వ్యవహరిస్తాం. ఒకే వేదికగా అన్ని తరగతుల కొనుగోలుదారులను చేరుకునేందుకు గృహప్రవేశం సరైన వేదిక అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేవలం ప్రాజెక్ట్‌లను ప్రదర్శించేందుకు ఈ షోలో పరిమితం కాదు.. ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, అభివృద్ధి అవకాశాలను క్షుణ్ణంగా వివరిస్తూ, బృంద చర్చలు నిర్వహించడం ముదావ హం.

* ఎస్‌వీసీ వెంచర్స్ ప్రై.లి. హెడ్‌సేల్స్ అండ్ మార్కెటింగ్ వీ. రమేష్ మాట్లాడుతూ.. నగరం వేదికగా జరిగే ప్రాపర్టీ షోలో గృహప్రవేశానికి ప్రత్యేక స్థానం ఉంది. నిర్వహణలో కాదు ఇదే వేదికగా బుకింగ్స్ జరగడమూ చాలా సందర్భాల్లో ఎదురైంది.

 * రాంకీ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ లి. సీరియర్ మార్కెటింగ్ మేనేజర్ రేష్మ మాట్లాడుతూ.. ఇండియా ప్రాపర్టీ.కామ్‌తో మా అనుబంధం చాలా దగ్గరిది. గృహప్రవేశంలో పాల్గొనడం ఇది నాలుగోసారి. పాల్గొన్న ప్రతీసారి మంచి స్పందన వస్తుంది.

* ఇంటికి వేసే రంగుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయట.

 * ఎరుపు రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మం చిది కాదు. నీలం రంగు శరీరం లో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. ముదురు నీలం లివింగ్‌రూమ్, వంట గదిలో వాడకం ఉత్తమం.

 * ఆకుపచ్చ రంగును బెడ్ రూమ్ లో వినియోగించడం మంచిది. చిన్నారుల గదుల్లో ఏర్పాటు చేయడం వల్ల వారి చదువుకు ఆటంకం లేకుండా ఉంటుంది.

 * పసుపు రంగు మెదడులో పాజి టివ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడిలో ఉన్న వారికి ఈ రంగు ఔషదంగా పనిచేస్తుంది.

 * సంప్రదాయమైన రంగు తెలుపు. అందుకే పెళ్లిళ్లు, సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ అంశాలలో ఈ రంగును అధికంగా వినియోగిస్తుంటారు.

 సర్దుబాటుతో విశాలంగా!
ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను మార్చుకోలేం కదా. అందుకే ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటే సరి.

* తలుపు తీయగానే పెద్ద పెద్ద వస్తువులు కన్పిస్తే.. ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. అందుకే లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి. మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫా కమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటివి అయితే మరీ మంచిది.

* సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి ఆరడుగుల దూరంతో ఉంటే బావుంటుంది. ూ     బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యతతో పాటూ వాస్తూ దెబ్బతింటుంది.

భాగ్యనగరం.. విశ్వనగరంగా!
ఇదంతా సరేగానీ అసలు హైదరాబాద్‌లో స్థిరాస్తిని ఎందుకు కొనుగోలు చేయాలి? బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలను కాదని ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే గత కొంత కాలంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెరికా తర్వాత ఇండియాలో తమ తొలి కేంద్రం ఏర్పాటుకు భాగ్యనగరాన్నే ఎంచుకుంటున్నాయి. అందులో కొన్ని..

 * ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్.. అమెరికా తర్వాత తన తొలి కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. రూ.170 కోట్లతో వేవ్‌రాక్ సెజ్‌లో మ్యాప్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

 * ఏడాదికి రూ.2.7 లక్షల కోట్ల అమ్మకాలు జరిపే స్వీడన్‌కు చెందిన గృహ ఫర్నిషింగ్ సంస్థ ఐకియా.. దేశంలోనే తొలి స్టోర్‌నూ ఇక్కడే ఏర్పాటు చేస్తోంది. ఐటీ హబ్‌కు చేరువలో రూ.20 కోట్లతో 13 ఎకరాల స్థలంలో స్టోర్‌ను నిర్మిస్తోంది కూడా.

 * ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లూ నగర శివార్లలో అతిపెద్ద గిడ్డంగిలు ఏర్పాటు చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్.. గుండ్లపోచంపల్లిలో 2.20 లక్షల చ.అ.ల్లో, అమెజాన్.. కొత్తూర్‌లో 2.80 లక్షల చ.అ.ల్లో ఈ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి.

 * అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటుకు గూగుల్ సిద్ధమైంది. రూ.1,000 కోట్లతో గచ్చిబౌలిలో 2 మిలియన్ చ.అ.ల్లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

 * అమెరికాకు చెందిన సేల్స్‌ఫోర్స్ ఐటీ కంపెనీ.. మాదాపూర్‌లో 2 లక్షల చ.అ.ల్లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.

 * చౌక విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్.. శంషాబాద్ సమీపంలో రూ.100 కోట్లతో 15 వేల చ.అ.ల్లో ఇండియన్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను (ఐడీసీ) ఏర్పాటు చేస్తోంది.

 * ఇవీ భాగ్యనగరం ప్రధాన కేంద్రంగా వివిధ కంపెనీలు ప్రకటించిన కార్యకలాపాలు. ఇవి చాలవూ హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేందుకు. ఇవే కాదు ఉబర్, డీఈ-షా, బ్లాక్‌స్టోన్, టాటా వంటి కంపెనీలనేకం నగరం వేదికగా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.

మరిన్ని వార్తలు