ఓలా, ఉబెర్‌లకు షాక్‌ : నగరవాసులకు ఊరట

28 Jun, 2019 16:44 IST|Sakshi

సాక్షి,  హైదరాబాద్ ‌: క్యాబ్‌ సర్వీసు సంస్థలు ఓలా, ఉబెర్‌తో విసిగిపోయిన హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.  ప్రధానంగా డిమాండ్‌ను బట్టి చార్జీలు, సర్‌ చార్జీలు బాదేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్న ప్రధాన క్యాబ్‌ సర్వీసులకు షాకిచ్చేలా టోరా క్యాబ్స్ పేరుతో నగరంలోకి కొత్త క్యాబ్‌ సర్వీసుల సంస్థ  ఎంట్రీ ఇచ్చింది.  ‘జీరో సర్జ్, జీరో కమిషన్ క్యాబ్స్‌’ లక్ష్యమని టోరా ప్రకటించడం విశేషం.  అంతేకాదు  తమ యాప్‌ ఆధారిత సర్వీసు ద్వారా పారదర్శక బిజినెస్‌తో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఇద్దరికీ ప్రయోజనాలు అందించాలని భావిస్తోంది. జూన్‌ 12న  పైలట్ వెర్షన్‌గా సేవలను ప్రారంభించిన టోరా క్యాబ్స్‌ వచ్చే 45 రోజుల్లో పూర్తి సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొరియన్ సంస‍్థ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నామని టోరా క్యాబ్స్‌ డైరెక్టర్ ఎస్.బి. షిన్ చెప్పారు. తన సేవలను తొలుత హైదరాబాద్‌‌లోనే ప్రారంభించడం విశేషమన్నారు.  హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1500 మంది డ్రైవర్లు తమ ప్లాట్‌ఫాంపై  రిజిస్టరై ఉన్నారని, మరో 45  రోజుల్లో ఈ సంఖ్య 4 వేలకు చేరుతుందని టోరా క్యాబ్స్  మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా భాస్కరన్ ప్రకటించారు.ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతమైన, ప్రయోజనం కల్గించే విధానాన్ని టోరా ప్రవేశపెడుతోందని అన్నారు. 

టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(టీటీఎస్‌‌పీఎల్)  డ్రైవర్లు  కేవలం రోజువారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.199, వారానికి రూ. 1194 నెలకు రూ.4975గా నిర్ణయించింది. ఇది మినహా ఎలాంటి కమిషన్లు తీసుకోదు. దీనికి తోడు కంపెనీ నుంచి డ్రైవర్లు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ను పొందుతారు. అలాగే ప్రయాణికుల నుంచి ఎలాంటి సర్‌‌‌‌ఛార్జ్‌‌ను వసూలు చేయమని మినిమమ్ ఛార్జీగా మూడు కిలోమీటర్లకు రూ.39 వసూలు చేయనున్నామని, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌‌‌‌కు బేస్ ఛార్జీగా రూ.8ను విధించనున్నామని ఆమె పేర్కొన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక చార్జీలు వసూలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు