కార్పొ బ్రీఫ్స్‌...

7 Sep, 2018 01:48 IST|Sakshi

ఎల్‌ అండ్‌ టీ: కంపెనీ ఆస్తులు, ఉద్యోగుల సంక్షేమ నిధి పరంగా నిర్వహణ లోపం చోటు చేసుకుందంటూ ఉదయ్‌ దీక్షిత్‌ అనే మాజీ ఉద్యోగి ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. ఈ అంశంపై కంపె నీ స్పందించింది. పిటిషనర్‌ వాదన నిరాధారమైనదని వ్యాఖ్యానించింది. 
     
ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌: లిక్విడేషన్‌ నేపథ్యంలో కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను సెప్టెంబరు 14 నుంచి నిలిపివేస్తున్నట్టు బీఎస్‌ఈ ప్రకటించింది.

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌: బెంగళూరుకు చెందిన గ్రాఫిన్‌ సెమి కండక్టర్‌ సర్వీసెస్‌ కంపెనీలో వంద శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.93 కోట్లని, ఈ ఏడాది అక్టోబర్‌ కల్లా ఈ డీల్‌ పూర్తవుతుందని ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేర్కొంది.  

బజాజ్‌ ఆటో: క్వాడ్రిసైకిల్, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్‌ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  

సీఏఐటీ: వాల్‌మార్ట్‌– ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న ట్రేడర్స్‌ సంఘం – సీఏఐటీ (ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ కాన్ఫెడరేషన్‌) ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఒక రోజు బంద్‌ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ‘భారత్‌ ట్రేడ్‌ బంద్‌’కు దాదాపు 7 కోట్ల మంది వర్తకులు మద్దతిచ్చినట్లు తెలిపింది. 

పాలసీబజార్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తున్నట్లు ఆన్‌లైన్‌ బీమా సర్వీసుల సంస్థ పాలసీబజార్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది. ఎల్‌ఐసీ కొనుగోలు సైతం తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి జోరందుకున్న నేపథ్యంలో ఈ సారి ఆదాయంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. 

టాటా స్టీల్‌: పర్యావరణానికి మేలు చేసే నూతన స్టీల్‌ ఉత్పత్తి టెక్నాలజీని ఆవిష్కరించింది. నెదర్లాండ్స్‌లో పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ టెక్నాలజీతో కార్బన్‌ డయాక్‌సైడ్‌ విడుదల సగానికి తగ్గిపోతుందని వెల్లడించింది.  

విస్తారా: బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌తో కోడ్‌ షేరింగ్‌ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లోని పలు ప్రాంతాలలో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సేవలను తమ సంస్థ ద్వారా పొందవచ్చని వెల్లడించింది.  
ఎస్‌బీఐ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టరుగా అన్షులా కాంత్‌  గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్‌బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వర్తించారు.  

పీఎన్‌బీ: నాన్‌– సీటీఎస్‌ (చెక్‌ టర్న్‌కేషన్‌ సిస్టమ్‌) చెక్కులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రొసెస్‌ చేయబోమని ప్రకటించింది. గడువు తేదీలోపుగా పాత చెక్కులను బ్యాంకుకు సమర్చించి, నూతన చెక్‌ బుక్‌లను పొందాల్సిందిగా కస్టమర్లకు తెలియజేసింది. 

>
మరిన్ని వార్తలు