టెల్కోలకు ట్రాయ్‌ నోటీసులు!

1 Jan, 2018 02:22 IST|Sakshi

రూ.2,578 కోట్ల రికవరీకి చర్యలు

న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రూ.2,578 కోట్ల మేర వసూలు చేసుకునేందుకు గాను ఐదు టెలికం సంస్థలకు నోటీసులు జారీ చేయనుంది. టాటా టెలీ సర్వీసెస్, టెలినార్, వీడియోకాన్‌ టెలికామ్, క్వాడ్రంట్‌ (వీడియోకాన్‌ గ్రూపు సంస్థ), రిలయన్స్‌ జియో తమ ఆదాయాలను రూ.14,800 కోట్ల మేర తక్కువ చేసి చూపడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,578 కోట్ల మేర ఆదాయం తక్కువగా వచ్చిదంటూ క్రంప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ఇవ్వగా, ఇది డిసెంబర్‌ 19న పార్లమెంటు ముందుకు చేరిన విషయం తెలిసిందే.

లైసెన్స్‌ ఫీజు రూపంలో రూ.1,015 కోట్ల మేర తక్కువగా, స్పెక్ట్రమ్‌ వినియోగ ఫీజు రూ.511 కోట్ల మేర, ఆలస్యంగా చేసిన చెల్లింపులపై రూ.1,052 కోట్ల మేర వడ్డీ టెలికం సంస్థలు ప్రభుత్వానికి తక్కువగా చెల్లించాయన్నది నివేదిక సారాంశం. ఈ నేపథ్యంలో తగ్గిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఆయా టెలికం సంస్థలకు ట్రాయ్‌ డిమాండ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు