పెరిగిన టెల్కోల ఆదాయాలు

22 Aug, 2019 09:15 IST|Sakshi

అయిదేళ్ల వ్యవధిపై ట్రాయ్‌ నివేదిక

న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో మొబైల్‌ డేటా చార్జీలు ఏకంగా 95 శాతం తగ్గాయి. జీబీకి రూ.11.78 స్థాయికి దిగివచ్చాయి. అయితే టెలికం ఆపరేటర్ల సంచిత ఆదాయం మాత్రం 2.5 రెట్లు పెరిగి రూ. 54,671 కోట్లకు చేరింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014లో దేశీయంగా డేటా వినియోగం 828 మిలియన్‌ జీబీగా ఉండగా, 2018లో ఇది 56 రెట్లు పెరిగి 46,404 మిలియన్‌ జీబీకి పెరిగింది. అలాగే యూజర్లపరంగా సగటు డేటా వినియోగం 0.27 జీబీ నుంచి 7.6 జీబీ దాకా పెరిగింది. ఇక ప్రతి యూజరుపై సగటు ఆదాయం 2014లో రూ. 71.25గా ఉండగా 2018లో ఇది రూ. 90.02కి చేరింది. 2014లో వైర్‌లెస్‌ డేటా యూసేజి విభాగం ద్వారా మొత్తం ఆదాయం రూ. 22,265 కోట్లు రాగా.. గతేడాది రూ. 54,671 కోట్లకు చేరినట్లు ట్రాయ్‌ నివేదిక పేర్కొంది. మరోవైపు, యూజరుకు వైర్‌లెస్‌ డేటా ఖరీదు సగటున రూ. 269 (జీబీకి) నుంచి రూ. 11.78కి పడిపోయిందని వివరించింది.

>
మరిన్ని వార్తలు