మున్ముందు ఎన్‌పీఏలు మిలీనియల్స్‌వేనా?

13 Nov, 2019 07:50 IST|Sakshi

ఈ విభాగంలో అత్యధికం అన్‌సెక్యూర్డ్‌ రుణాలే

ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ నివేదికలో వెల్లడి

ముంబై: మిలీనియల్స్‌ (1980– 2000 మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారనున్నాయా..? గత రెండేళ్లుగా బ్యాంకులకు మిలీనియల్స్‌ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్‌ సంఖ్య 58% పెరగ్గా, ఇతర విభాగంలో ఈ వృద్ధి 14%గానే ఉందని  సిబిల్‌ నివేదిక తెలిపింది.

కార్పొరేట్‌ రుణాల్లో భారీ ఎన్‌పీఏల నేపథ్యంలో బ్యాంకులు రిటైల్‌ రుణాలపై ఎక్కువ గా ఆధారపడడం తెలిసిందే. అన్‌ సెక్యూర్డ్‌ రుణాల కింద క్రెడిట్‌ కార్డులు, పర్సనల్‌ లోన్లు, కన్జ్యూమర్‌ రుణాలు ఇస్తున్నారు. మిలీనియల్స్‌ రుణాల్లో 72% ఇవే ఉంటున్నాయని సిబిల్‌ నివేదించింది. ఇక మిలీనియల్స్‌ తీసుకుంటున్న రుణాల్లో సురక్షిత (సెక్యూర్డ్‌) రుణాల కిందకు వచ్చే వాహన రుణాలు 9% ఉన్నట్లు సిబిల్‌ వెల్లడించింది. తమ క్రెడిట్‌ స్కోరుపై మిలీనియల్స్‌ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, స్కోరును పర్యవేక్షించుకుంటున్నారని పేర్కొంది. 700 కంటే తక్కువ స్కోరు కలిగిన వారిలో 51% మంది 6 నెలల్లోనే   క్రెడిట్‌ స్కోరును మెరుగుపరుచుకున్నారని వివరించింది.

>
మరిన్ని వార్తలు