చిరిగిన నోట్ల మార్పిడి విధానాల్లో మార్పు! 

8 Sep, 2018 01:35 IST|Sakshi

ముంబై: చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి విధి విధానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం సవరించింది. చిరిగిన లేక పాడైపోయిన 50 రూపాయలు ఆపైన డినామినేషన్స్‌ కరెన్సీ నోట్లకు పూర్తి విలువ పునఃచెల్లింపునకు సంబంధించి ‘‘పాడైపోయిన నోటు కనీసం ఎంత పరిమాణంలో ఉండాలి’’ అనే నిర్దేశాలను మార్చినట్లు  ఆర్‌బీఐ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది.  పెద్ద నోట్ల అనంతరం రూ.2,000 సహా అంతకన్నా తక్కువ డినామినేషన్‌లో కొత్త నోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన నేపథ్యంలో ‘పాడైపోయిన లేక చిరిగిపోయిన ఆయా నోట్ల మార్పిడికి అనుగుణంగా’ ఈ సవరణలు జరిగాయి. 2016 నవంబర్‌లో రూ.500, 1,000 నోట్లను రద్దు చేశారు.

వెంటనే రూ.2,000 రూ.500 వ్యవస్థలో వచ్చాయి.  ఆపై క్రమంగా రూ. 100, రూ. 50, రూ. 20, రూ.10 రూ.5 కొత్త నోట్లూ వ్యవస్థలోకి విడుదలయ్యాయి. ప్రజలు చిరిగిన, పాడైపోయిన నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాలు, నిర్దేశిత బ్యాంక్‌ బ్రాంచీల్లో కొత్తవాటితో మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పిడి పూర్తి విలువలో జరగాలా? లేక అందులో సగం విలువే లభిస్తుందా? అన్నది చిరిగిన లేదా పాడైపోయిన కరెన్సీని స్థితి ఆధాకంగా ఉంటుంది. అంటే ఒక చిరిగిన లేక పాడైపోయిన కరెన్సీ నోట్‌ను మీరు మార్చుకోదలచుకుంటే, అందుకు సంబంధించి దాని స్థితిని బట్టి మీకు ‘రిటర్న్‌  కరెన్సీ నోట్‌’ విలువ ఉంటుంది. తాజా నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయి.    

మరిన్ని వార్తలు