చౌక కాల్స్, డేటాకు చెల్లు!!

18 Dec, 2019 02:09 IST|Sakshi

కనీస చార్జీల విధింపుపై ట్రాయ్‌ చర్చాపత్రం

అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయ సేకరణ

అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 17 దాకా గడువు  

న్యూఢిల్లీ: చౌక మొబైల్‌ కాల్స్, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా, మొబైల్‌ సర్వీసెస్ కనీస చార్జీలను నిర్ణయించడంపైనా సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస చార్జీలు నిర్ణయించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించతగిన విధానాలపైనా అభిప్రాయాలను ఆహా్వనించింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 17 దాకా గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్‌–కామెంట్స్‌ సమరి్పంచడానికి జనవరి 31 ఆఖరు తేది. ‘టెలికం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఎకానమీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. టెలికం రంగ సమస్యలు పరిష్కరించేందుకు, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాయ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

యూ టర్న్‌...
టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తాజా ట్రాయ్‌ చర్చాపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. టారిఫ్‌ల విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్‌ ప్లాన్లను ప్రకటించిన వారం రోజుల్లోగా ట్రాయ్‌కు తెలిపితే సరిపోతుంది. కాబట్టి యూజర్లను ఆకర్షించేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, అత్యంత చౌక ప్లాన్స్‌ కూడా అందిస్తూ వచ్చాయి.  ఒకవేళ కనీస చార్జీల విధానం గానీ అమల్లోకి వస్తే.. ఉచిత సరీ్వసులకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు పరిశీలించతగిన చర్యలంటూ అక్టోబర్‌లో చేసిన సిఫార్సుల్లో ఈ కనీస చార్జీల ప్రతిపాదన కూడా ఉంది.

అటు పాత టెల్కోలు కూడా దీన్ని గట్టిగా కోరుతున్నాయి. రిలయన్స్‌ జియో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండేళ్ల క్రితం టెల్కోలు ఇలాంటి ప్రతిపాదనే చేసినప్పటికీ.. ఇది సాధ్యపడే విషయం కాదని ట్రాయ్‌ తోసిపుచి్చంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పరిశీలించాలని భావిస్తోంది. లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టులో ప్రతికూల ఆదేశాలు రావడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సెపె్టంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రికార్డు స్థాయిలో రూ. 50,922 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు ఎయిర్‌టెల్‌ కూడా రూ. 23,045 కోట్లు నష్టాలు ప్రకటించింది.

2021 దాకా ఐయూసీ కొనసాగింపు

న్యూఢిల్లీ: టెలికం సంస్థల ఇంటర్‌కనెక్ట్‌ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2021 జనవరి 1 దాకా కొనసాగించాలని ట్రాయ్‌ నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ చార్జీలు పూర్తిగా ఎత్తివేసేలా ప్రతిపాదనలు చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కాల్స్‌ స్వీకరించినందుకు.. టెల్కోలు వసూలు చేసే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. ఈ విధానాన్ని 2020 జనవరి 1 నుంచి ఎత్తివేసే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. దీన్ని 2021 దాకా కొనసాగించాలని ట్రాయ్‌ నిర్ణయం తీసుకుంది. తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న టెలికం రంగానికి ఇది కాస్త ఊరటనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో 14 పైసలుగా ఉన్న ఐయూసీ చార్జీలను ట్రాయ్‌ 2017 అక్టోబర్‌లో 6 పైసలకు తగ్గించింది.

దీంతో టెలికం సంస్థలు రూ. 11,000 కోట్ల మేర నష్టపోయాయని అంచనా. ఒకవేళ 6 పైసల ఐయూసీని కూడా ఎత్తివేసిన పక్షంలో పరిశ్రమపై మరో రూ. 3,672 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడేది. దీనితో పాటు వినియోగదారుల ప్రయోజనాలు, టెలికం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐయూసీ స్థానంలో కొత్త బీఏకే (బిల్‌ అండ్‌ కీప్‌) విధానం అమలును ఏడాది పాటు వాయిదా వేసినట్లు ట్రాయ్‌ తెలిపింది.  ట్రాయ్‌ నిర్ణయాన్ని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఐయూసీని పరిగణనలోకి తీసుకునే టెల్కోలు ఇటీవల చార్జీలను పెంచినందున.. వినియోగదారులపై కొత్తగా దీని ప్రభావమేమీ ఉండబోదని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు