ఫార్మా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి 

8 Jan, 2020 02:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా రంగాలు వెనుకబడి నప్పటికీ ఫార్మా  మాత్రం పరుగు పెడుతోంది. రెండంకెల వృద్ధితో ఆశాజనకంగా ఉంది. భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు 2019 నవంబరులో రూ.12,530 కోట్లు నమోదు చేశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20.60 శాతం అధికం. జూన్‌ తర్వాత అత్యధిక ఎగుమతులు నమోదు చేసింది నవంబరులోనే. జూన్‌లో రూ.12,810 కోట్ల విలువైన ఎక్స్‌పోర్ట్స్‌ జరిగాయి.

ఇక 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబరులో భారత్‌ నుంచి విదేశాలకు సరఫరా అయిన ఔషధాలు రూ.95,848 కోట్లుగా ఉన్నాయి. 2018–19 ఏప్రిల్‌–నవంబర్‌తో పోలిస్తే ఇది 11.46 శాతం ఎక్కువ. చాలా రంగాలు తిరోగమన వృద్ధిలో ఉంటే ఫార్మా రంగం వృద్ధి బాటన ఉండడం శుభపరిణామమని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ్‌ భాస్కర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 2019–20లో భారత ఫార్మా ఎగుమతులు 14.5 శాతం అధికమై రూ.1,54,000 కోట్లు నమోదవుతాయని ఫార్మెక్సిల్‌ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు