జూమ్‌ కాల్‌తో 3700మందికి ఉబెర్‌ ఉద్వాసన

14 May, 2020 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇవాళే ఉబెర్‌ ఉద్యోగులకు చివరి రోజు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన ఉబెర్ టెక్నాలజీస్‌ ఇటీవల తమ సంస్థ 14 శాతం(3700)  ఉద్యోగులను తొలగించనున్నట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 3700 మంది ఉద్యోగులకు జూమ్‌ ద్వారా ఫోన్‌ చేసి వారిని తొలగించినట్లు సమాచారం అందించినట్లు ఉబెర్ సర్వీసెస్‌‌ హెడ్‌ రుఫిన్ చెవలౌ‌‌ గురువారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మిగతా సంస్థల వలె ఉబెర్‌ కూడా ఆర్థిక సవాళ్లకు ఎదుర్కొంది. అయితే ఉబెర్‌ తమ ఉద్యోగులకు ఇకపై వారి సేవలు అవసరం లేదని చెప్పి తొలగించడంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. (కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత)

దీనిపై రుఫిన్ చెవలౌ‌‌ స్పందిస్తూ.. ‘మేము 3700 మంది ఫ్రంట్‌లైన్‌ కస్టమర్‌ సపోర్టులో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తున్నాము. మీ సేవలు ఇక సంస్థకు అవసరం లేదు. ఉబెర్‌కు పనిచేయడానికి ఇదే మీ చివరి రోజు’ అని జూమ్‌ ఆప్‌ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేగాక ‘వారికి ఫోన్‌ చేసి ఈ  చేదు వార్తను వారికి అందించడం చాలా కష్టంగా అనిపించింది. ఇక తమ సేవలను ఉబెర్‌కు అందించిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపినప్పటికీ వారు స్పందించిన తీరు తీవ్రంగా ఉంది. కొంత మంది ఉద్యోగులు తమ బాధను వ్యక్తపరిస్తే, మరికొందరూ దీనిపై ముందుగా నోటీసులు ఇవ్వకుండా కేవలం మూడు నిమిషాలు ఫోన్‌ కాల్‌తో ఉద్యోగాలు ఎలా తీసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు’ అని ఆమె తెలిపారు. (ప్రముఖ ఆటో కంపెనీ ఎంట్రీ : ఓలా, ఉబెర్‌కు చెక్?)

కాగా కరోనా మహమ్మారి కారణంగా ఉబెర్‌ వ్యాపారం దాదాపు సగానికి పడిపోయిందని ఆ సంస్థ వెల్లడించింది. 2020 మొదటి త్రైమాసికంలో ఉబెర్ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చూసినట్లు నివేదించింది. ఇటీవల ఉబెర్‌ జంప్, బైక్‌, స్కూటర్ బిజినెస్‌ లైమ్ అనే సంస్థకు ఆఫ్‌ లోడ్ చేసింది, ఈ సంస్థ 85 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అయితే కారోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుత్ను లాక్‌డౌన్‌ వల్ల ఉబెర్‌లో పనిచేసే చాలా మంది కస్టమర్‌ సపోర్టు ఉద్యోగులకు తగినంత పని లేకపోవడం వల్లే వారిని తొలగించినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు