ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌పై షాకింగ్‌ రిపోర్టు 

11 Sep, 2018 19:50 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆధార్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచీ.. దాని డేటా సెక్యురిటీ ఓ హాట్‌టాఫిక్‌గా మారిపోయింది. ఆధార్‌ నెట్‌వర్క్‌ సురక్షితంగా కాదంటూ ఇప్పటికే పలు రిపోర్టులు తేల్చాయి. ఈ రిపోర్టులను యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) కొట్టిపారేస్తూ వస్తోంది. వందల వేల సార్లు ప్రయత్నించినా ఆధార్‌ డేటాను బ్రేక్‌ చేయలేరని యూఐడీఏఐ చెబుతూ వస్తోంది. కానీ మూడు నెలల పాటు జరిగిన ఓ ఇన్వెస్టిగేషన్‌లో ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ హ్యాక్‌ చేయొచ్చని వెల్లడైంది. సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌ ద్వారా కొత్త ఆధార్‌ యూజర్లు ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లోని క్లిష్టమైన భద్రతా ఫీచర్లను డిసేబుల్‌ చేమొచ్చని హుఫ్‌పోస్ట్‌ ఇండియా బహిర్గతం చేసింది. 

ఈ ప్యాచ్‌ కేవలం రూ.2500కే లభ్యమవుతుందని, అనధికారిక వ్యక్తులు ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌ చేసేలా ఇది అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది. ప్రపంచంలో ఏమూల నుంచైనా.. ఆధార్‌ నెంబర్లను జనరేట్‌ చేసేలా వారికి అనుమతి ఇస్తుందని రిపోర్టు తెలిపింది. దీన్ని విస్తృతంగా వాడుతున్నట్టు కూడా పేర్కొంది. మూడు విభిన్న ప్రదేశాల నుంచి గ్లోబల్‌ సెక్యురిటీ నిపుణుల ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేయించినట్టు హుఫ్‌పోస్టు ఇండియా వెల్లడించింది. ఈ ముగ్గురు కూడా హ్యాక్‌ను ధృవీకరించినట్టు తెలిపింది. ప్యాచ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌-బిల్ట్‌ జీపీఎస్‌ సెక్యురిటీ ఫీచర్‌ను డిసేబుల్‌ చేస్తుందని రిపోర్టు వెల్లడించింది. యూజర్లను ఎన్‌రోల్‌ చేయడానికి ప్రపంచంలోనే ఏ మూల నుంచైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడేలా అనధికారిక వ్యక్తులకు అనుమతిస్తుందని పేర్కొంది.  
 

>
మరిన్ని వార్తలు