15 రోజుల్లో ఆధార్‌ ఆపే ప్లాన్‌ చెప్పండి!!

1 Oct, 2018 17:49 IST|Sakshi

న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు ఆధార్‌ను వాడుకోరాదంటూ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కీలక తీర్పు నేపథ్యంలో యూనిక్‌ అథంటికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) తదుపరి చర్యలు ప్రారంభించింది. ఆధార్‌ ధృవీకరణను రద్దు చేసే ప్లాన్‌ గురించి అక్టోబర్‌ 15 లోగా తమకు తెలియజేయాలని టెలికాం కంపెనీలను యూఐడీఏఐ ఆదేశించింది. ‘ అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు వెంటనే 26.09.2018 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలి. ఈ తీర్పు నేపథ్యంలో ఆధార్‌ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను రద్దు చేసే యాక్షన్‌ ప్లాన్‌/ఎగ్జిట్‌ ప్లాన్‌ను 2018 అక్టోబర్‌ 15లోగా మాకు సమర్పించాలి’ అని యూఐడీఏఐ ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కంటే ముందు, ప్రతి టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి జియో వరకు తమ మొబైల్‌ యూజర్ల నుంచి తప్పనిసరిగా ఆధార్‌ను లింక్‌ ప్రక్రియను చేపట్టాయి. కొత్త మొబైల్‌ నెంబర్లకు, పాత నెంబర్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆధార్‌ తప్పనిసరి చేశాయి. కానీ సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు షాకిస్తూ.. ఆధార్‌ ధృవీకరణను వాడుకోవద్దంటూ ఆదేశించింది. బ్యాంక్‌లు సైతం ఆధార్‌ లింక్‌ను తప్పనిసరి చేయుద్దని తీర్పు వెలువరించింది. స్కూల్‌ అడ్మినిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీలకు కూడా ఆధార్‌ అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వ పథకాలకు, పాన్‌ నెంబర్లకు ఆధార్‌ తప్పనిసరి అని టాప్‌ కోర్టు పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు