125 కోట్ల మందికి ఆధార్‌

28 Dec, 2019 06:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్‌ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్‌ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నాయని తెలిపింది. అలాగే ఆధార్‌ వివరాల అప్‌డేట్‌ అభ్యర్థనలు కూడా రోజుకు 3–4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది.

సీఎస్‌సీల్లో మళ్లీ ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలో భాగమైన సీఎస్‌సీ ఈ–గవర్నెన్స్‌ సర్వీసెస్‌ సంస్థ మళ్లీ ఆధార్‌ రిజి స్ట్రేషన్, సంబంధిత సర్వీసులను ప్రారంభించింది. వచ్చే వారం దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్, మార్పులు.. చేర్పులు వంటి సేవలు అందించేందుకు .. యూఐడీఏఐతో సీఎస్‌సీ ఎస్‌పీవీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.6 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు (సీఎస్‌సీ).. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఆన్‌లైన్‌ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నాయి. డేటా లీకేజీ, నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని సీఎస్‌సీ ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సేవలు రెండేళ్ల క్రితం నిల్చిపోయాయి.  

మరిన్ని వార్తలు