అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,014 కోట్లు 

25 Apr, 2019 01:00 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ 

5.5 శాతం పెరిగిన షేర్‌   

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లాగ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,014 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో రూ.446 కోట్ల నికర లాభం వచ్చిందని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,401 కోట్ల నుంచి రూ.11,031 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం వ్యయాలు రూ.9,554  కోట్లని తెలిపింది. ఇతర ఆదాయం 27 శాతం పెరిగి రూ.140 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.2,213 కోట్లుగా, ఎబిటా మార్జిన్‌ 21 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడానికి లేదని కంపెనీ తెలిపింది. బినానీ సిమెంట్స్‌ కంపెనీని విలీనం చేసుకున్నామని, అందుకే ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది.  

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,224 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,432 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.32,461 కోట్ల నుంచి రూ.37,817 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్‌ జోరుగా పెరిగింది. బీఎస్‌ఈలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్‌ 5.5 శాతం లాభంతో రూ. 4,435 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు