యూనియన్ బ్యాంక్ లాభం 27% డౌన్

9 May, 2014 01:13 IST|Sakshi

 క్యూ4లో రూ. 579 కోట్లు
 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 579 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 789 కోట్లతో పోలిస్తే ఇది 27% క్షీణత. మొండిబకాయిలకు ప్రొవిజన్లు పెరగడం, వడ్డీయేతర ఆదాయం తగ్గడం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంకు చైర్మన్ అరుణ్ తివారీ పేర్కొన్నారు. బకాయిలకు కేటాయింపులు రూ. 655 కోట్ల నుంచి రూ. 920 కోట్లకు పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం రూ. 875 కోట్ల నుంచి రూ. 775 కోట్లకు తగ్గింది. నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.61% నుంచి 2.33%కు పెరిగాయి. ఈ కాలంలో రూ. 320 కోట్లమేర మొండి రుణాలను విక్రయించింది.
 
వడ్డీ ఆదాయం 3.6% అప్
క్యూ4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 3.6% పుంజుకుని రూ. 2,052 కోట్లను తాకగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.62%గా నమోదయ్యాయి. ఇదే కాలానికి బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,445 కోట్లకు ఎగసింది. ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 21%పైగా క్షీణించి రూ. 1,696 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంకు షేరు దాదాపు 9% పతనమై రూ. 135 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు