ఇక ఈ వాహనాలు ఖరీదే

1 Feb, 2020 17:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   "మేక్ ఇన్ ఇండియా" చొరవలో  భాగంగా  స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ రకాల వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  కేంద్ర బడ్జెట్ 2020 - 21 ప్రసంగంలో శనివారం ప్రకటించారు. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) పై కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి పెంతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే. 2020 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీంతో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే  ఈ మేరకు దేశీయ కంపెనీలకు కాస్త ఊరట లభించనుంది.  

ప్రయాణీకుల సెమీ నాక్-డౌన్ (ఎస్‌కెడి) పాసింజర్‌ వాహనాలపై  కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అదేవిధంగా, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సాంప్రదాయ వాణిజ్య వాహనాల  సీబీయూల కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఉత్ప్రేరక (కెటాలిక్‌) కన్వర్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం నుండి 7.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాకుండా, ప్రయాణీకుల ఈవీలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు, బస్సు మరియు ట్రక్కుల యొక్క పూర్తిగా నాక్-డౌన్ (సికెడి) రూపాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  కాలుష్య ఉద్గారాలు అదుపులేని స్థాయికి పెరగడంతో గ్రీన్‌మొబిలిటీపై  ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో, వివిధ కార్ల తయారీదారులు గత కొన్నేళ్లుగా దేశంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఎంజి మోటార్ ఇండియా కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాయి. అదేవిధంగా మెర్సిడెస్ బెంజ్, ఆడి, జెఎల్‌ఆర్‌  లాంటి కంపెనీలు కూడా దేశంలో ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు